Saving Scheme: పోస్టాఫీస్ లేదా ఎల్ఐసీ.. రిటైర్మెంట్ తర్వాత బిందాస్గా ఉండేందుకు ఏది బెస్ట్
Saving Scheme: సురక్షిత పెట్టుబడితో పాటు ప్రతి నెలా లేదా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారు ఎక్కువగా ప్రభుత్వ, ఎల్ఐసీ పథకాలనే ఎంచుకుంటారు.
Saving Scheme: పోస్టాఫీస్ లేదా ఎల్ఐసీ.. రిటైర్మెంట్ తర్వాత బిందాస్గా ఉండేందుకు ఏది బెస్ట్
Saving Scheme: సురక్షిత పెట్టుబడితో పాటు ప్రతి నెలా లేదా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారు ఎక్కువగా ప్రభుత్వ, ఎల్ఐసీ పథకాలనే ఎంచుకుంటారు. అలాంటి వారిలో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS), LIC జీవన్ శాంతి పథకాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది మీకు అనుకూలం? ఏ పథకం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
LIC జీవన్ శాంతి పథకం అంటే ఏంటి?
LIC జీవన్ శాంతి ఒక సింగిల్ ప్రీమియం పెన్షన్ పథకం. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెడితే, మీరు ఎంచుకున్న కాలవ్యవధి పూర్తయిన తర్వాత క్రమం తప్పకుండా పెన్షన్ అందుతుంది. ఈ పథకంలో సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ అనే రెండు ఎంపికలు ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి మాత్రమే పెన్షన్ తీసుకోవచ్చు లేదా భార్యాభర్తలు ఇద్దరికీ వర్తించే విధంగా కూడా పాలసీని ఎంచుకోవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టే సమయంలోనే పెన్షన్ మొత్తం నిర్ణయిస్తారు. తర్వాత మార్కెట్ పరిస్థితులు ఎలా మారినా, నిర్ణయించిన మొత్తమే క్రమం తప్పకుండా అందుతుంది. అందుకే రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోరుకునే వారు ఈ పథకాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
పోస్ట్ ఆఫీస్ MIS పథకం ఎలా పనిచేస్తుంది?
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (POMIS)లో పెట్టుబడి పెడితే ప్రతి నెలా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 7.4 శాతం హామీ వడ్డీ లభిస్తోంది. అయితే ఈ వడ్డీని ప్రతి నెలా ఖాతాదారుడి అకౌంట్లో జమ చేస్తారు. కనీసం రూ.1,000తో ఈ పథకంలో పెట్టుబడి ప్రారంభించవచ్చు. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. జాయింట్ అకౌంట్లో గరిష్టంగా ముగ్గురు సభ్యులు ఉండే అవకాశం ఉంది. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. గడువు పూర్తయిన తర్వాత పెట్టుబడి మొత్తాన్ని తిరిగి అందజేస్తారు. ప్రతి నెలా ఖర్చులకు ఒక స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఈ పథకం అనువైనది.
LIC జీవన్ శాంతి, Post Office MIS మధ్య తేడా ఏంటి?
ఈ రెండు పథకాల ప్రధాన లక్ష్యం పెట్టుబడిదారులకు సురక్షితమైన ఆదాయం అందించడమే అయినప్పటికీ, అవి పనిచేసే విధానం వేర్వేరుగా ఉంటుంది. LIC జీవన్ శాంతిలో ఒకేసారి పెట్టుబడి పెట్టి, నిర్ణయించిన గడువు తర్వాత పెన్షన్ అందుకుంటారు. కానీ పోస్టాఫీస్ ఎమ్ఐఎస్లో పెట్టుబడి పెట్టిన వెంటనే ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం రావడం ప్రారంభమవుతుంది. జీవన్ శాంతిలో కనీస పెట్టుబడి రూ.1.5 లక్షలు కాగా గరిష్ట పరిమితి లేదు. అయితే POMISలో సింగిల్ అకౌంట్కు రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్కు రూ.15 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. జీవన్ శాంతి పాలసీకి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కానీ Post Office MISకు అలాంటి పన్ను మినహాయింపు ఉండదు.
ఏ పథకం ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది?
రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం స్థిరమైన పెన్షన్ కావాలని భావించే వారికి LIC జీవన్ శాంతి మంచి ఎంపిక. భవిష్యత్తులో ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ప్రతి నెలా వెంటనే ఆదాయం అవసరమయ్యే వారికి Post Office MIS మంచి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా వృద్ధులు, గృహిణులు లేదా నెలవారీ ఆదాయంపై ఆధారపడే చిన్న పెట్టుబడిదారులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది.
చివరగా ఏది ఎంచుకోవాలి?
LIC జీవన్ శాంతి, Post Office MIS రెండూ సురక్షిత పెట్టుబడి పథకాలే. అయితే మీ అవసరం ఏంటన్న దాని ఆధారంగా ఎంచుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత దీర్ఘకాలం పెన్షన్ పొందాలనుకుంటే LIC జీవన్ శాంతి సరైన ఎంపిక. ప్రతి నెలా వెంటనే స్థిరమైన ఆదాయం కావాలనుకుంటే Post Office MISను ఎంచుకోవచ్చు. కాబట్టి మీ పెట్టుబడి సామర్థ్యం, భవిష్యత్ లక్ష్యాలు, నెలవారీ ఆదాయ అవసరాన్ని బట్టి ఈ రెండు పథకాలలో మీకు సరిపోయేదాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.




