Credit Card: క్రెడిట్ కార్డు మోసాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఫిర్యాదు చేస్తే 5 రోజుల్లో రీఫండ్

Credit Card: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కలిగించేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

Mokshith
Published on: 26 Jun 2026 4:31 PM IST
Credit Card
X

Credit Card: క్రెడిట్ కార్డు మోసాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఫిర్యాదు చేస్తే 5 రోజుల్లో రీఫండ్

Credit Card: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కలిగించేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. ముఖ్యంగా క్రెడిట్ కార్డు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన మోసాల కేసుల్లో బాధితులు ఎక్కువకాలం డబ్బు కోసం ఎదురుచూడకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త గడువులు కూడా నిర్ణయించింది.

క్రెడిట్ కార్డు మోసం జరిగితే 5 రోజుల్లో తాత్కాలిక రీఫండ్

కొత్త నిబంధనల ప్రకారం, క్రెడిట్ కార్డు ద్వారా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు కస్టమర్ ఫిర్యాదు చేస్తే, బ్యాంకు ఐదు పని దినాల్లోగా ఆ వివాదాస్పద మొత్తాన్ని తాత్కాలికంగా ఖాతాలో జమ చేయాలి. దీనిని 'షాడో రివర్సల్' (Shadow Reversal) విధానంగా పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు వినియోగదారుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే విచారణలో ఫిర్యాదు తప్పు అని తేలితే, తిరిగి ఆ మొత్తాన్ని బ్యాంకు రికవరీ చేసే అవకాశం ఉంటుంది.

మోసాల విచారణకు కొత్త గడువులు నిర్ణయించిన ఆర్బీఐ

ఈ-ఫ్రాడ్ ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి బ్యాంకులకు మరింత స్పష్టమైన కాలపరిమితిని ఆర్బీఐ నిర్ణయించింది. దేశీయ డిజిటల్ మోసాల కేసులను 45 రోజుల్లో, విదేశీ లావాదేవీలకు సంబంధించిన మోసాలను 60 రోజుల్లో పరిష్కరించాలని సూచించింది. గతంలో ప్రతిపాదించిన 30 రోజుల గడువుతో పోలిస్తే బ్యాంకులకు అదనపు సమయం ఇచ్చింది. కొత్త నిబంధనలను అమలు చేసేందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసుకోవడానికి ఆరు నెలల సమయం కూడా కల్పించింది.

పరిహారం పొందాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి

మోసానికి గురైన వినియోగదారులు బ్యాంకుకు ఫిర్యాదు చేయడంతో పాటు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కూడా ఫిర్యాదు నమోదు చేసి, దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలి. విచారణలో ఫిర్యాదు నకిలీగా లేదా ఒకే ఘటనపై రెండుసార్లు చేసినట్లు తేలితే, ఇప్పటికే పొందిన తాత్కాలిక రీఫండ్‌ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ ఈ-ఫ్రాడ్‌ల విషయంలో విదేశీ బ్యాంకుల నుంచి నష్టపరిహారం వసూలు చేయడం కష్టమవుతున్నందున, ఆ బాధ్యతల పంపిణీ విధానంలో కూడా ఆర్బీఐ మార్పులు చేసింది.

ఏ కేసులకు ఈ నిబంధనలు వర్తించవు?

క్రెడిట్ కార్డు లేదా డిజిటల్ లావాదేవీల్లో జరిగిన మోసాలకు మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత సరిగా లేకపోవడం, సేవలు అందకపోవడం, వ్యాపార సంస్థలతో ఏర్పడే వినియోగదారుల వివాదాలు, చెక్కులకు సంబంధించిన సమస్యలు ఈ మార్గదర్శకాల పరిధిలోకి రావని ఆర్బీఐ స్పష్టం చేసింది. సైబర్ మోసాల బాధితులకు త్వరగా ఉపశమనం కల్పించడం, బ్యాంకింగ్ వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యంగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story