India GDP Growth : జీడీపీ గ్రోత్‌కు గ్లోబల్ షాక్‌లు.. ఆర్‌బీఐ రిపోర్టులో కీలక హెచ్చరిక

India GDP Growth : ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, దేశ ఆర్థిక వృద్ధి రేటు (జీడీపీ) త్రైమాసిక..

G Krishna
Published on: 5 Jun 2026 11:36 AM IST
India GDP Growth
X

India GDP Growth

India GDP Growth : ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, దేశ ఆర్థిక వృద్ధి రేటు (జీడీపీ) త్రైమాసిక అంచనాలకు సంబంధించిన కీలక వివరాలను కూడా ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారత నిజమైన జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. దేశీయ ఆర్థిక వృద్ధి అంచనాలకు అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న అస్థిరత , వాతావరణ మార్పుల వల్ల వచ్చే షాక్‌లు దేశ ఆర్థిక వృద్ధిని వెనక్కి లాగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

త్రైమాసిక వారీగా వృద్ధి రేటు

రాబోయే ఆర్థిక సంవత్సరంలో వివిధ త్రైమాసికాల వారీగా జీడీపీ వృద్ధి రేటు హెచ్చుతగ్గులతో సాగనుందని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుందని అంచనా వేయగా, అది రెండూ త్రైమాసికం నాటికి స్వల్పంగా తగ్గి 6.3 శాతానికి పరిమితం కానుంది. అయితే ఆ తర్వాత నుంచి ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుని మూడో త్రైమాసికంలో 6.5 శాతానికి, ఇక ఆఖరిదైన నాలుగో త్రైమాసికంలో అత్యధికంగా 6.8 శాతానికి చేరుకుంటుందని ఆర్‌బీఐ లెక్కగట్టింది.

ఆహార రంగంపై ఎల్ నినో ప్రభావం

మరోవైపు దేశంలో ఆహార ఉత్పత్తుల ధరలు , వాటి లభ్యతపై ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోందని ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నైరుతి రుతుపవనాల అంచనాలు, అలాగే 'ఎల్ నినో' ప్రభావం వల్ల వ్యవసాయ రంగానికి ఇబ్బందులు ఎదురై, ఆహార రంగంపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని గవర్నర్ వివరించారు. దేశంలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సమీక్షా కమిటీ అభిప్రాయపడింది. అయినప్పటికీ, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, అంతర్జాతీయ , దేశీయ మార్కెట్లపై మరింత స్పష్టత వచ్చే వరకు వేచి చూడడమే ఉత్తమమని ద్రవ్య విధాన కమిటీ భావించినట్లు గవర్నర్ స్పష్టం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story