Rajesh Exports: ఏ తప్పూ చేయలేదు.! ఆ రూ. 15 లక్షల కోట్లు ఎక్కడ.? కంపెనీలో ఎల్ఐసీ వాటా..
Rajesh Exports: దేశంలోనే మరో అతిపెద్ద ఫైనాన్షియల్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ కంపెనీ 'రాజేష్ ఎక్స్పోర్ట్స్' ఏకంగా రూ. 15 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడినట్లు సెబీ గుర్తించింది.
Rajesh Exports: ఏ తప్పూ చేయలేదు.! ఆ రూ. 15 లక్షల కోట్లు ఎక్కడ.? కంపెనీలో ఎల్ఐసీ వాటా..
Rajesh Exports: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో భారీ ఫైనాన్షియల్ కుంభకోణం బయటపడింది. బెంగళూరుకు చెందిన 'రాజేష్ ఎక్స్పోర్ట్స్' సంస్థ మోసానికి పాల్పడినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఏకంగా రూ. 15 లక్షల కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కావడం, ఇందులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీకి సైతం వాటా ఉండటంతో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
స్కామ్ ఎలా బయటపడిందంటే?
ఒక ఇన్వెస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెబీ ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టింది. సెబీ జరిపిన ఈ విచారణలోనే ఈ కుంభకోణం బయటపడింది. 2021-25 మధ్య కాలంలో విదేశాల్లో ఉన్న తమ అనుబంధ కంపెనీల ద్వారా నకిలీ రికార్డులు సృష్టించి, ఏకంగా రూ. 15 లక్షల కోట్ల అధిక ఆదాయాన్ని వచ్చినట్లు ఆ కంపెనీ తప్పుగా చూపించిందని సెబీ పేర్కొంది. ఈ మోసానికి బాధ్యుడిని చేస్తూ కంపెనీ చైర్మన్ రాజేష్ మెహతాపై సెబీ నిషేధం విధించింది. ఈ పరిణామాలతో గత మూడేళ్ల వ్యవధిలో ఆ కంపెనీ షేరు విలువ అమాంతం 90 శాతం పడిపోయింది.
మదుపరుల పరిస్థితి ఏంటి?
రూ. 15 లక్షల కోట్ల స్కామ్ ఆరోపణల్లో ఇరుక్కున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు దారుణంగా రూ.3 వేల కోట్లకు పడిపోయింది. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ కంపెనీలో ఎల్ఐసీకి 10.8 శాతం వాటా ఉంది. అలాగే 1,94,110 మంది రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా ఇందులో 14.13 శాతం వాటా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ మోసంపై సెబీ చేసిన ప్రకటన ప్రభావంతో నిన్న ఎల్ఐసీ షేర్ వాల్యూ కూడా 1.05 శాతం మేర తగ్గింది.
కంపెనీ ఏమంటోందంటే..
తమపై వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థ స్పందించింది. తాము ఎలాంటి తప్పూ చేయలేదని కంపెనీ వెల్లడించింది. కేవలం సెబీతో తమకు ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఈ గందరగోళం అంతా నెలకొందని ఆ సంస్థ పేర్కొంది. ఈ కుంభకోణంపై తదుపరి విచారణలో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.




