Money: నెలకు రూ. 25 వేల ఎస్ఐపీ ఇన్వెస్ట్మెంట్.. 15 ఏళ్లలో ఎంతొస్తుంది.?
మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు కోసం నెలవారీగా రూ. 25,000 చొప్పున ఎస్ఐపీ విధానంలో పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల తర్వాత ఎంత రిటర్న్ పొందవచ్చో ఆర్థిక నిపుణులు వివరించారు.
Money: నెలకు రూ. 25 వేల ఎస్ఐపీ ఇన్వెస్ట్మెంట్.. 15 ఏళ్లలో ఎంతొస్తుంది.?
Money: ప్రస్తుత కాలంలో పెరుగుతున్న జీవన వ్యయాలు, ఈఎంఐల మధ్య కూడా చాలా మంది భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని భావిస్తుంటారు. ప్రత్యేకించి నెలవారీగా రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు సంపాదిస్తున్న దంపతులు తమ పిల్లల చదువులు లేదా భవిష్యత్తు అవసరాల కోసం ముందస్తుగా ప్రణాళిక వేసుకోవడం ఎంతో అవసరం. సుమారు 15 సంవత్సరాల కాలపరిమితితో ప్రతినెలా రూ. 25,000 చొప్పున ఎస్ఐపీ రూపంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొత్తాన్ని క్రమశిక్షణతో మదుపు చేయడం ద్వారా పెద్దఎత్తున సంపదను కూడబెట్టుకోవచ్చు.
సాధారణంగా 15 సంవత్సరాల పాటు నెలకు రూ. 25 వేల చొప్పున కట్టే మొత్తం సుమారు రూ. 45 లక్షలు అవుతుంది. దీనిపై సగటున 12 శాతం రిటర్న్ వస్తే సుమారు రూ. 1.2 కోట్లు రావచ్చు. అయితే 15 ఏళ్ల తర్వాత ద్రవ్యోల్బణం కారణంగా ఆ డబ్బుల అసలు విలువ సగానికి పడిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కేవలం సాధారణ రిటర్న్ పట్ల సంతృప్తి చెందకుండా, నాణ్యమైన ఫండ్లను ఎంచుకోవడం ద్వారా 15 శాతం నుంచి 18 శాతం వరకు రిటర్న్స్ సాధించేలా వ్యూహం మార్చుకోవాలి. ఫండ్ మేనేజర్ అనుభవం, రోలింగ్ రిటర్న్స్, రిస్క్ స్థాయిలను సరిగ్గా బేరీజు వేసుకోవడం అత్యంత ముఖ్యం.
కాగా, కేవలం ఆన్లైన్ రేటింగ్లు లేదా బ్రాండ్ పేరు చూసి గుడ్డిగా పెట్టుబడులు పెట్టకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అవగాహన లేకుండా నేరుగా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి సరైన నిపుణుల మార్గదర్శకత్వం తీసుకోవడం మంచిది. దైనందిన ఖర్చులు పెరుగుతున్న తరుణంలో సేవింగ్స్ పెంచడం కష్టమైతే, మెరుగైన రిటర్న్స్ వచ్చే మార్గాలను ఎంచుకోవడం ద్వారా లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని సూచిస్తున్నారు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ దీర్ఘకాలికంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు.




