Silver Import : వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. దిగుమతులపై కేంద్రం ఉక్కుపాదం
Silver Import : కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు విధించింది. వెండి బార్లను ఫ్రీ నుంచి రిస్ట్రిక్టెడ్ జాబితాలోకి మారుస్తూ DGFT నోటిఫికేషన్ ఇచ్చింది.
Silver
Silver Import : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, సామాన్యులు, ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయంగా వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు వెండి కొనడం కూడా అంత సులభం కాకపోవచ్చు. వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మే 16, 2026) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా సాగుతున్న వెండి దిగుమతులను నియంత్రిస్తూ పలు కేటగిరీలను రిస్ట్రిక్టెడ్ జాబితాలోకి చేర్చింది. దేశంలో పెరుగుతున్న వ్యాపార లోటును తగ్గించడానికి, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏం మారింది?
ఇప్పటి వరకు వెండి బార్లు (Silver Bars), వెండి పొడి (Silver Powder), సెమీ-మాన్యుఫ్యాక్చర్డ్ వెండి వస్తువులను దిగుమతి చేసుకోవడానికి పెద్దగా ఆంక్షలు ఉండేవి కావు. కానీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం.. ఈ వస్తువులను ఫ్రీ కేటగిరీ నుంచి రిస్ట్రిక్టెడ్ కేటగిరీకి మార్చారు. దీని అర్థం ఏమిటంటే, ఇకపై వెండిని దిగుమతి చేసుకోవాలంటే వ్యాపారులు ముందుగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి లేదా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి బార్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు?
భారతదేశంలో వెండి దిగుమతులు ఏటా ఏకంగా 157 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగడం, రూపాయిపై ఒత్తిడి పెరగడం వంటి కారణాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేవలం బంగారంపైనే కాకుండా, వెండి దిగుమతులపై కూడా కన్నేయడం ద్వారా విదేశీ కరెన్సీ బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రధాని మోదీ సర్కార్ భావిస్తోంది. గత వారమే బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు నేరుగా దిగుమతులపైనే ఆంక్షలు విధించడం గమనార్హం.
సామాన్యులపై ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల దేశీయ మార్కెట్లో వెండి లభ్యత తగ్గే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే సహజంగానే వెండి ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్లో నగల తయారీదారులకు, పారిశ్రామిక అవసరాల కోసం వెండి వాడే కంపెనీలకు ఈ నిర్ణయం కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే, అనవసరమైన దిగుమతులను అరికట్టడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తమ ప్రాధాన్యత అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.




