మీరు త‌ల్లికి వంద‌నం ప‌థ‌కానికి అర్హులా, కాదా.? ఫోన్‌లోనే ఇలా చెక్ చేసుకోండి

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమ‌వుతోన్న త‌రుణంలో త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై చ‌ర్చ న‌డుస్తోంది.

Mokshith
Published on: 4 Jun 2026 1:07 PM IST
Talliki Vandanam
X

మీరు త‌ల్లికి వంద‌నం ప‌థ‌కానికి అర్హులా, కాదా.? ఫోన్‌లోనే ఇలా చెక్ చేసుకోండి

Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమ‌వుతోన్న త‌రుణంలో త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల అర్హతను సులభంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

తల్లికి వందనం పథకం అంటే ఏంటి?

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల్లో ‘తల్లికి వందనం’ ఒక ముఖ్యమైన పథకం. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు అలాగే ఇంటర్మీడియట్‌లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ప్రతి ఏడాది ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000 మంజూరు చేస్తారు. ఇందులో రూ.13,000 నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన రూ.2,000ను విద్యా మౌలిక వసతుల అభివృద్ధి కోసం వినియోగిస్తారు.

అర్హుల జాబితా సిద్ధం..

పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే ప్రక్రియ పూర్తి చేసింది. అయితే తమ పిల్లల పేరు జాబితాలో ఉందా లేదా అనే సందేహం చాలా కుటుంబాల్లో కనిపిస్తోంది.

గతంలో సాంకేతిక లోపాలు, ఆధార్ అనుసంధానం సమస్యలు, బ్యాంకు ఖాతాల వివరాల్లో పొరపాట్ల కారణంగా కొంతమంది లబ్ధిదారులు సాయం పొందలేకపోయారు. దీంతో ఈసారి ముందుగానే అర్హతను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫోన్‌లోనే స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం

అర్హత తెలుసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందుబాటులో ఉంచిన ప్రత్యేక పోర్టల్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా bm.sgsw.ap.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అనంత‌రం "Scheme Eligibility" ఎంపికను క్లిక్ చేయాలి. లబ్ధిదారుడి లేదా తల్లి ఆధార్ నంబర్ నమోదు చేయాలి. సంబంధిత పథకం, విద్యా సంవత్సరం ఎంపిక చేసుకోవాలి. "Get Details" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఈ విధంగా అర్హత స్థితి, నమోదైన సమాచారం, ఇతర వివరాలను చెక్ చేసుకోవ‌చ్చు.

డేటా లోపాలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి

ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక పరిశీలనలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల వివరాల్లో కొన్ని లోపాలు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆధార్ లింక్‌ లేకపోవడం, బ్యాంకు ఖాతా వివరాలు సరిపోలకపోవడం, కుటుంబ సభ్యుల మ్యాపింగ్ పూర్తికాకపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

పోర్టల్‌లో వివరాలు పరిశీలించినప్పుడు ఏదైనా తప్పు కనిపిస్తే వెంటనే దానిని సరిచేసుకోవడం అవసరం. లేకపోతే సాయం జమ కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది.

డబ్బులు రావాలంటే ఈ అంశాలు తప్పనిసరి

తల్లికి వందనం సాయం అందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హత ప్రమాణాలు పూర్తి కావాలి. తల్లి బ్యాంకు ఖాతా ఆధార్‌తో అనుసంధానం అయి ఉండాలి. మొబైల్ నంబర్ ఆధార్‌కు లింక్ అయి ఉండాలి. కుటుంబ సభ్యుల ఈ-మ్యాపింగ్ పూర్తి కావాలి. విద్యార్థి వివరాలు విద్యాశాఖ రికార్డుల్లో సరిగ్గా నమోదు అయి ఉండాలి. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి. ఈ అంశాల్లో ఏదైనా పెండింగ్‌లో ఉంటే సాయం విడుదలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

సమస్యలు ఉంటే ఎక్కడ సంప్రదించాలి?

పోర్టల్‌లో వివరాలు కనిపించకపోవడం, అర్హతలో లోపాలు రావడం లేదా డేటా పొరపాట్లు ఉంటే సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చు. అక్కడి సిబ్బంది ఈ-కేవైసీ, ఆధార్ ధృవీకరణ, బ్యాంకు ఖాతా మ్యాపింగ్ వంటి అంశాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రతి కుటుంబం తమ వివరాలను ఒకసారి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముందుగానే సమాచారం సరిచేసుకుంటే పథకం ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందే అవకాశం ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story