అకౌంట్లో డబ్బులు లేకున్నా UPI పేమెంట్ చేయొచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్
UPI: భారత్లో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఫిన్టెక్ సంస్థలు కొత్త సేవలను తీసుకొస్తున్నాయి.
అకౌంట్లో డబ్బులు లేకున్నా UPI పేమెంట్ చేయొచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్
UPI: భారత్లో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఫిన్టెక్ సంస్థలు కొత్త సేవలను తీసుకొస్తున్నాయి. తాజాగా భారత్పే (BharatPe), యెస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ‘భారత్పే ఫ్లెక్స్’ పేరుతో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
UPI క్రెడిట్ లైన్ అంటే ఏమిటి?
సాధారణంగా UPI ద్వారా చెల్లింపులు చేయాలంటే బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉండాలి. అయితే కొత్తగా అందుబాటులోకి వచ్చిన UPI క్రెడిట్ లైన్ సదుపాయం ద్వారా ఖాతాలో డబ్బులు లేకపోయినా ముందుగా చెల్లింపు చేయవచ్చు. ఇది ఒక విధంగా క్రెడిట్ కార్డు తరహాలో పనిచేస్తుంది. వినియోగదారులకు ముందుగా ఒక నిర్దిష్ట క్రెడిట్ పరిమితి కేటాయిస్తారు. ఆ పరిమితి మేరకు UPI ద్వారా ఖర్చు చేయవచ్చు. తర్వాత నిర్ణీత గడువులో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అందుబాటులో లేనప్పుడు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.
45 రోజుల వరకు వడ్డీ లేకుండా సౌకర్యం
ఈ ఫీచర్లో ముఖ్యమైన ఆకర్షణ వడ్డీ రహిత కాలం. వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తాన్ని 45 రోజులలోపు చెల్లిస్తే ఎలాంటి వడ్డీ భారం ఉండదు. దీంతో తాత్కాలిక నగదు కొరత ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా మారుతుంది. అంతేకాకుండా ఒకేసారి మొత్తం చెల్లించడం కష్టమైతే EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. మూడు నెలల నుంచి 12 నెలల వరకు వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తాల ఖర్చులను కూడా సులభంగా నిర్వహించవచ్చు.
ఎక్కడెక్కడ ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు?
ఈ క్రెడిట్ లైన్ను దాదాపు అన్ని UPI ఆధారిత చెల్లింపుల కోసం వినియోగించవచ్చు. QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, ఆన్లైన్ షాపింగ్, విద్యుత్ లేదా ఇతర యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్లు, ట్రావెల్ టికెట్ బుకింగ్లు, ఇంధన కొనుగోళ్లు వంటి రోజువారీ అవసరాల కోసం ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. UPI మర్చంట్ల వద్ద సాధారణ UPI లావాదేవీల మాదిరిగానే చెల్లింపులు చేయవచ్చు. దీంతో ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
భారత్పే ఫ్లెక్స్ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
ఈ సేవను పొందాలనుకునే వారు ముందుగా భారత్పే యాప్లో క్రెడిట్ లైన్ కోసం దరఖాస్తు చేయాలి. అర్హత ప్రమాణాలను పరిశీలించిన తర్వాత అర్హులైన వినియోగదారులకు చాలా తక్కువ సమయంలో ఆమోదం లభిస్తుంది. సాధారణంగా కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత KYC ప్రక్రియను పూర్తి చేసి, మంజూరైన క్రెడిట్ లైన్ను UPI ఖాతాతో అనుసంధానం చేయాలి. అనంతరం UPI పిన్ సెట్ చేసుకున్న తర్వాత సాధారణ UPI చెల్లింపుల మాదిరిగానే ఈ సేవను ఉపయోగించవచ్చు. యాప్లోనే అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి, ఖర్చులు, బకాయిలు, చెల్లింపుల వివరాలను సులభంగా ట్రాక్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. అదనంగా అర్హత కలిగిన లావాదేవీలపై రివార్డులు పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు.




