UPI Scam: పెళ్లి ప‌త్రిక పేరుతో ఏపీకే ఫైల్ వ‌చ్చిందా.? క్లిక్ చేశారో అంతే సంగ‌తులు!

UPI Scam: డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన కొద్దీ ఆన్‌లైన్‌ మోసాల తీరు కూడా మారుతోంది. ముఖ్యంగా యూపీఐ ద్వారా క్షణాల్లో డబ్బులు పంపుకునే సౌకర్యాన్ని సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

Mokshith
Published on: 29 Aug 2026 2:17 PM IST
UPI Scam
X

UPI Scam: పెళ్లి ప‌త్రిక పేరుతో ఏపీకే ఫైల్ వ‌చ్చిందా.? క్లిక్ చేశారో అంతే సంగ‌తులు!

UPI Scam:

డిజిటల్‌ లూటీ’ అంటే ఏంటి?

యూపీఐ యాప్‌ ద్వారా లావాదేవీ జరగాలంటే వినియోగదారుడి ఫోన్‌, అందులోని సిమ్‌, బ్యాంకు ఖాతా మధ్య ఉన్న అనుసంధానం కీలకం. సాధారణంగా ఈ వివరాలను ధ్రువీకరించిన తర్వాతే యాప్‌ చెల్లింపులకు అనుమతిస్తుంది.

అయితే సైబర్‌ నేరగాళ్లు ఈ నమ్మక వ్యవస్థనే లక్ష్యంగా చేసుకుని కొత్త దాడి విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు సైబర్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ క్లౌడ్‌సెక్‌ వెల్లడించింది. ఇందులో ఫోన్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థలో మార్పులు చేసి, సిమ్‌, యాప్‌ గుర్తింపు, ఎస్‌ఎంఎస్‌ ధ్రువీకరణ వంటి భద్రతా అంశాలను మోసపూరితంగా ప్రభావితం చేస్తారు.

దీంతో యూపీఐ యాప్‌కు అంతా సక్రమంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి వినియోగదారుడికి తెలియకుండానే అతడి ఆర్థిక సమాచారంపై హ్యాకర్లు నియంత్రణ సాధించే పరిస్థితి ఏర్పడుతుంది.

పెళ్లి పత్రిక పేరుతో మాల్‌వేర్‌ ఎలా వస్తుంది?

మోసానికి మొదటి అడుగు బాధితుడి ఫోన్‌లోకి హానికరమైన ఏపీకే ఫైల్‌ను పంపించడమే. ఇందుకోసం సైబర్‌ నేరగాళ్లు ప్రజలు సాధారణంగా నమ్మే సందర్భాలను ఉపయోగించుకుంటారు. పెళ్లి పత్రిక, ట్రాఫిక్‌ చలానా, ఇతర ముఖ్యమైన నోటీసుల పేరుతో ఫైల్‌ లేదా లింక్‌ను పంపుతారు.

దానిని చూసిన వినియోగదారు నిజమైన సమాచారం అనుకుని లింక్‌ను తెరిచి, ఏపీకే ఫైల్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేస్తే అసలు ప్రమాదం మొదలవుతుంది. యాప్‌ ఇన్‌స్టాల్‌ సమయంలో అడిగే అనుమతులను పరిశీలించకుండా అంగీకరిస్తే మాల్‌వేర్‌కు ఫోన్‌లోని కీలకమైన సమాచారాన్ని యాక్సెస్‌ చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎస్‌ఎంఎస్‌లను చదవడం, వాటిని ఇతరులకు పంపడం వంటి కార్యకలాపాలను మాల్‌వేర్‌ చేపట్టగలదు.

ఓటీపీలు, బ్యాంకింగ్‌ మెసేజ్‌లను ఎలా దొంగిలిస్తారు?

మాల్‌వేర్‌ ఫోన్‌లోకి ప్రవేశించిన తర్వాత బ్యాంకు నుంచి వచ్చే సందేశాలపై దృష్టి పెడుతుంది. ఖాతా నమోదు, ధ్రువీకరణ, ఓటీపీ వంటి ముఖ్యమైన ఎస్‌ఎంఎస్‌లు హ్యాకర్లకు చేరేలా వ్యవస్థను మార్చే ప్రయత్నం చేస్తుంది.

మరోవైపు హ్యాకర్లు ప్రత్యేకమైన సాంకేతిక సాధనాలను ఉపయోగించి పరికరం గుర్తింపును మార్చే అవకాశం ఉంటుంది. బాధితుడి ఫోన్‌ నుంచే సందేశాలు పంపినట్లు కనిపించేలా నకిలీ ఎస్‌ఎంఎస్‌ రికార్డులను సృష్టించవచ్చు.

దీంతో యూపీఐ వ్యవస్థకు అసలు పరికరం, సిమ్‌ కార్డు నుంచే ధ్రువీకరణ జరిగినట్లు భ్రమ కలుగుతుంది. అయితే వాస్తవంగా యూపీఐ సంబంధిత కార్యకలాపాలను హ్యాకర్లు తమ వద్ద ఉన్న మరో పరికరం ద్వారా నిర్వహించే అవకాశం ఉంటుంది.

ఇలాంటి దాడుల్లో ముఖ్యమైన ప్రమాదం ఏమిటంటే.. బాధితుడికి వెంటనే మోసం జరిగిన విషయం తెలియకపోవచ్చు. ఫోన్‌లో సాధారణంగానే సందేశాలు కనిపించడం వల్ల అనుమానం రాకపోవచ్చు.

తెలియని APK ఫైళ్లను ఇన్‌స్టాల్‌ చేయకండి

ఇలాంటి సైబర్‌ దాడులను నివారించేందుకు మొదటి జాగ్రత్తగా తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైళ్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వాట్సాప్‌, టెలిగ్రామ్‌ లేదా ఇతర సామాజిక వేదికల్లో వచ్చిన ఫైళ్లను ధ్రువీకరించకుండా తెరవకూడదు.

పెళ్లి పత్రిక, చలానా, ఉద్యోగ సమాచారం, బహుమతి, బ్యాంకు నోటీసు వంటి పేర్లతో వచ్చిన ఫైల్‌ అయినా సరే.. వెంటనే ఇన్‌స్టాల్‌ చేయకూడదు. అధికారిక యాప్‌ అవసరమైతే గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ వంటి విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌ల నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

అలాగే ఫోన్‌లో ఏ యాప్‌కు ఎలాంటి అనుమతులు ఇచ్చామో అప్పుడప్పుడు పరిశీలించడం మంచిది. అవసరం లేని యాప్‌లకు ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌, యాక్సెసిబిలిటీ వంటి సున్నితమైన అనుమతులు ఇవ్వకపోవడం భద్రతకు ఉపయోగపడుతుంది.

అనుమానం వస్తే వెంటనే ఈ చర్యలు తీసుకోండి

మీ ఫోన్‌లో అనుమానాస్పద ఏపీకే ఫైల్‌ ఇన్‌స్టాల్‌ చేసినట్లు గుర్తిస్తే ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలి. ముందుగా ఆ యాప్‌ను తొలగించేందుకు ప్రయత్నించాలి. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే బ్యాంకును వెంటనే సంప్రదించి యూపీఐ, కార్డు లేదా సంబంధిత బ్యాంకింగ్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరాలి.

ఖాతాలో అనధికారిక లావాదేవీలు జరిగాయా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి. ఓటీపీలు, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోకూడదు. అవసరమైతే బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లు, యూపీఐ పిన్‌లను మార్చుకోవాలి.

డబ్బు మోసపోయినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో పాటు సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మోసం జరిగిన సమయం, ఫోన్‌కు వచ్చిన సందేశాలు, అనుమానాస్పద లింకులు, లావాదేవీ వివరాలు వంటి ఆధారాలను భద్రపరచడం ఫిర్యాదు ప్రక్రియలో ఉపయోగపడుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story