UPI charges: రూపాయి ఛార్జీ పడని 7 ఉచిత UPIలు ఇవే..!

UPI charges: యూపీఐ లావాదేవీలపై రూ.2000 దాటితే ఛార్జీలంటూ వస్తున్న ప్రచారంలో నిజమెంత? ఆర్‌బీఐ , ఎన్‌పీసీఐ నిబంధనల ప్రకారం ఎలాంటి ఛార్జీలు ఉండవు.

Gagan kumar
Published on: 18 Sept 2026 8:57 AM IST
UPI charges
X

UPI charges: రూపాయి ఛార్జీ పడని 7 ఉచిత UPIలు ఇవే..!

UPI charges: డిజిటల్ ఇండియా పుణ్యమా అని ఇప్పుడు జేబులో పర్సు లేకపోయినా పర్వాలేదు కానీ, చేతిలో మొబైల్ లేకపోతే మాత్రం ఏ పనీ జరగని పరిస్థితి. గల్లీలో టీ తాగినా, బండికి పెట్రోల్ కొట్టించినా, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినా మన చేయి ఆటోమెటిక్‌గా యూపీఐ స్కానర్ వైపే వెళ్తోంది.

అయితే, ఇటీవల యూపీఐ ద్వారా రూ. 2000 దాటి పేమెంట్ చేస్తే ఛార్జీలు పడతాయట అనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం అవుతోంది. దీంతో సామాన్య వినియోగదారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.

కానీ, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ , నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కింది 7 రకాల లావాదేవీలపై మీరు ఒక్క రూపాయి కూడా అదనపు ఛార్జీ చెల్లించాల్సిన పనిలేదు.అవేంటో ఓ లుక్కేద్దాం.

1. ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా నుంచి మరొకరి బ్యాంక్ ఖాతాకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా పంపే డబ్బులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. మీరు ఎంతైనా పంపుకోవచ్చు, ఇవి 100% ఉచితం.

2.కిరాణా కొట్టు, టీ బంక్, కూరగాయల మార్కెట్ లాంటి చిన్న వ్యాపారుల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చేసే లావాదేవీలకు ఛార్జీలు పడవు. ఇలా నెలకు రూ. 1 లక్ష వరకు ఉచితంగా పేమెంట్స్ చేసుకోవచ్చు.

3. మీ ఫోన్‌పే, పేటీఎం లేదా ఇతర ప్రీపెయిడ్ వాలెట్ల నుంచి రూ. 2000 లోపు చేసే చెల్లింపులకు కూడా ఎండీఆర్ మినహాయింపు ఉంది.

4.ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా వంటి ఈ-కామర్స్ సైట్లలో నేరుగా మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి యూపీఐ ద్వారా చేసే పేమెంట్లపై ఎలాంటి ఛార్జీలు పడవు.

5. కరెంటు బిల్లులు, ప్రభుత్వ పన్నులు, ట్రాఫిక్ చలానాలు వంటివి యూపీఐ ద్వారా చెల్లిస్తే ఒక్క పైసా కూడా ఎక్స్‌ట్రా ప్రాసెసింగ్ ఫీజు పడదు.

6. నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, మ్యూచువల్ ఫండ్ సిప్‌లు, ఈఎంఐల కోసం మీరు సెట్ చేసుకునే ఆటోమేటిక్ డెబిట్ లావాదేవీలన్నీ కస్టమర్లకు ఉచితమే.

7. మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లేదా వ్యాపారులకు యూపీఐ ద్వారా చేసే పేమెంట్లు రూ. 2000 లోపు ఉంటే అస్సలు ఛార్జీలు పడవు.

ఈ 7 లావాదేవీలు మీకు పూర్తి ఉచితం. అక్టోబర్ 15, 2026 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం, రూ. 2000 దాటిన పర్సన్ టూ మర్చంట్ లావాదేవీలపై మాత్రమే మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధిస్తారు.

ఈ ఎండీఆర్ ఛార్జీలను వినియోగదారులు చెల్లించక్కర్లేదు! కేవలం ఆ పేమెంట్‌ను స్వీకరించే వ్యాపారులు మాత్రమే ఈ ఫీజును భరించాల్సి ఉంటుంది. కస్టమర్ల నుంచి ఈ డబ్బును వసూలు చేయడం చట్టరీత్యా నేరం.

చట్టపరంగా వినియోగదారులకు ఈ ఛార్జీల భారం లేనప్పటికీ, ప్రాక్టికల్‌గా ఒక ఆందోళన మాత్రం ఉంది. వ్యాపారులు తమపై పడే ఈ ఎండీఆర్ ఛార్జీల భారాన్ని పరోక్షంగా వస్తువుల ధరలు పెంచడం ద్వారా లేదా ఇతర హిడెన్ ఛార్జీల రూపంలో కస్టమర్ల పైనే మోపుతారేమో అన్న భయం ప్రజల్లో నెలకొంది.

ఏది ఏమైనప్పటికీ, ఒక సామాన్య వినియోగదారుడిగా మీ రోజువారీ యూపీఐ లావాదేవీలన్నీ సురక్షితం , ఉచితం. కాబట్టి, రూ. 2000 దాటితే మీ అకౌంట్ నుంచి అదనంగా డబ్బులు కట్ అవుతాయనే తప్పుడు ప్రచారాలను నమ్మకండి. డిజిటల్ ఇండియాలో మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్మార్ట్‌గానే చెల్లింపులు కొనసాగించండి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.