వికసిత్ భారత్ 2047కు భారత్ లక్ష్యం 10 ట్రిలియన్ డాలర్లు

వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి భారత్ జీడీపీని 10 ట్రిలియన్ డాలర్లకు పెంచాలి. వాణిజ్యం, ఎఫ్‌డీఐ, సంస్కరణలు కీలకం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Aug 2026 12:40 AM IST
Viksit Bharat 2047
X

Viksit Bharat 2047

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాన్ని సాధించాలంటే దేశ ఆర్థిక వ్యవస్థను భారీగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఓ తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం సుమారు 4.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) కనీసం 10 ట్రిలియన్ డాలర్లకు చేరాల్సి ఉంటుందని తెలిపింది.

మాజీ దౌత్యవేత్త మోహన్ కుమార్ ‘ది జెరూసలేం పోస్ట్’లో రాసిన అభిప్రాయ కథనంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం గర్వించదగ్గ విషయమే అయినప్పటికీ.. దాదాపు 1.5 బిలియన్ల జనాభాకు ప్రస్తుత 4.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణం సరిపోదని ఆయన పేర్కొన్నారు.

విదేశీ వాణిజ్యం, ఎఫ్‌డీఐపై దృష్టి

భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయాలంటే ప్రపంచ విదేశీ వాణిజ్యంలో దేశ వాటాను పెంచాలని నివేదిక సూచించింది. అలాగే మరింత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకర్షించడంతో పాటు లోతైన, నిర్మాణాత్మక ఆర్థిక సంస్కరణలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

అయితే కేవలం ఆర్థిక వృద్ధి వేగాన్ని పెంచడం మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి సరిపోదని మోహన్ కుమార్ అభిప్రాయపడ్డారు. వృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు చేరేలా చూడాలని అన్నారు.

యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలి

భారత్‌లోని భారీ యువ జనాభాను ఉద్యోగాల కోసం వెతికే వారిగా కాకుండా.. వ్యాపారవేత్తలు, ఉద్యోగాల సృష్టికర్తలుగా తీర్చిదిద్దే ఆర్థిక వ్యవస్థ అవసరమని నివేదిక పేర్కొంది. వికసిత్ భారత్‌లో యువత వ్యవస్థాపకత కీలక స్తంభంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.

మోదీ ప్రభుత్వం హయాంలో దేశ స్టార్టప్ వ్యవస్థ వేగంగా విస్తరించింది. దేశంలో నమోదైన స్టార్టప్‌ల సంఖ్య 2.5 లక్షలకు పైగా చేరగా, యువ ఆవిష్కర్తలకు మద్దతుగా రూ.1 లక్ష కోట్ల ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు నివేదిక ప్రస్తావించింది.

ఏఐ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి

మారుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ అందించాల్సిన అవసరాన్ని కూడా నివేదిక నొక్కిచెప్పింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను పెంచాలని సూచించింది.

ప్రస్తుతం విద్యా వ్యవస్థలో సంప్రదాయ, బట్టీ విధానాలకు అధిక ప్రాధాన్యం ఉందని పేర్కొంటూ.. భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా విద్యా, నైపుణ్య వ్యవస్థలో మార్పులు అవసరమని తెలిపింది.

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వచ్చే ఏడాదిలో కోటి మంది యువతకు ఏఐ నైపుణ్య శిక్షణ అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకటించారు. ప్రపంచంలో ఏఐ రంగానికి నాయకత్వం వహించే సామర్థ్యాలను యువతలో పెంపొందించడమే దీని లక్ష్యంగా పేర్కొన్నారు.

ఆరోగ్య రంగంలోనూ భారీ మార్పులు అవసరం

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఆరోగ్య రంగాన్ని కూడా కీలకంగా పరిగణించాలని నివేదిక సూచించింది. ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను ప్రస్తావించిన మోహన్ కుమార్.. ప్రజారోగ్య మౌలిక వసతుల్లో మరింత భారీ స్థాయిలో మార్పులు అవసరమని అన్నారు.

దేశంలోని మెజారిటీ ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి, అందుబాటు ధరల్లోకి రావాలని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఆరోగ్య రంగంలో పెట్టుబడులు కీలకమని తెలిపారు.

‘మిషన్ మోడ్’లో పనిచేయాలి

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రభుత్వం అత్యవసర భావనతో, జాతీయ లక్ష్యంగా భావించి పనిచేయాలని మోహన్ కుమార్ అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల మధ్య సమన్వయంతో ‘వోల్-ఆఫ్-గవర్నమెంట్’ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు.

భారత్ 2047 నాటికి వికసిత్ భారత్‌గా అవతరించే స్థితిలో ఉందని.. అయితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు దేశం మిషన్ మోడ్‌లో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story