Madanapalle: సీటీఎం రోడ్డులో పార్కింగ్ ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలి
Madanapalle: మదనపల్లె సీటీఎం రోడ్డులోని వాణిజ్య సముదాయాల సెల్లార్ల ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను BYS డిమాండ్ చేసింది.
Madanapalle: సీటీఎం రోడ్డులో పార్కింగ్ ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలి
మదనపల్లె: పట్టణంలోని సీటీఎం రోడ్డులో ఉన్న వాణిజ్య సముదాయాల సెల్లార్లను పార్కింగ్కు బదులుగా దుకాణాలు, గోడౌన్లుగా వినియోగించడం వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని BYS నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
శనివారం BYS కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సీటీఎం రోడ్డులోని పలు షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నాయని ఆరోపించారు.
దీంతో వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలిపివేయాల్సి వస్తోందని, ఫలితంగా నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు, పాదచారులు, అత్యవసర సేవల వాహనాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ఈ సమస్యపై గతంలోనే మున్సిపల్ కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు కేవలం నోటీసులు జారీ చేయడానికే పరిమితమయ్యారని, ఆక్రమణలను తొలగించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు స్పందించి సీటీఎం రోడ్డులోని కమర్షియల్ కాంప్లెక్స్ల సెల్లార్లలో ఉన్న ఆక్రమణలను తొలగించి, వాటిని పార్కింగ్ కోసం అందుబాటులోకి తీసుకురావాలని BYS డిమాండ్ చేసింది.
లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించింది. ఈ విలేకరుల సమావేశంలో BYS ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




