Madanapalle: మదనపల్లె దళిత నేత శ్రీచందు అరెస్టుపై నిరసన
Madanapalle: మదనపల్లెలో దళిత నేత శ్రీచందు అక్రమ అరెస్టును ఖండించిన దళిత సంఘాలు. తప్పుడు కేసులు పెట్టిన సీఐ కళా వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Madanapalle: మదనపల్లె దళిత నేత శ్రీచందు అరెస్టుపై నిరసన
మదనపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసు రాజ్యం నడుస్తోందని దళిత సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. దళిత నేత, బహుజన సేన అధ్యక్షుడు శ్రీచందును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడాన్ని ఖండిస్తూ గురువారం మదనపల్లె ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్,
సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలాజీ, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకుంట శ్రీనివాసులు, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు కోనేటి దివాకర్రావు, బహుజన సేన ప్రతినిధి భానుప్రకాశ్ పాల్గొని మాట్లాడారు.
శ్రీచందుపై నమోదు చేసిన కేసులో నేరం జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ప్రాథమిక వివరాలు కూడా లేకుండానే కేసు నమోదు చేశారని, ఫిర్యాదుదారుతో మాట్లాడకుండానే దళిత నాయకుడిని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. కేసు నమోదు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మదనపల్లెలో విధులు నిర్వహిస్తున్న తాలూకా సీఐ కళా వెంకటరమణ అవినీతి, సివిల్ సెటిల్మెంట్లు, ఎస్సీ, ఎస్టీ బాధితుల పట్ల అన్యాయాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకే శ్రీచందును లక్ష్యంగా చేసుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఆయనపై సమగ్ర విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ (పీఓఏ) చట్టంలోని సెక్షన్-4తో పాటు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేయాలని, అవినీతి నిరోధక శాఖ ద్వారా ఆస్తులపై విచారణ చేపట్టాలని కోరారు.
రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేల మాటలకు కూడా విలువ లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కళా వెంకటరమణలాంటి అధికారులపై చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. ఆయనపై ఇప్పటికే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్లలో ఫిర్యాదులు విచారణలో ఉన్నాయని పేర్కొంటూ, వాటిపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
శ్రీచందుపై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకుని విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. సమావేశంలో బాస్ నాయకులు ముత్యాల మోహన్, సీఐటీయూ నాయకుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




