Madanapalle: సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌పై వైసీపీ నిర్లక్ష్యం – ఆర్‌జే వెంకటేష్ ధ్వజం

Madanapalle: మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని టీడీపీ సీనియర్ నేత ఆర్‌జే వెంకటేష్ ఆరోపణ.

Srinivasulu, Madanapalle
Published on: 22 Aug 2026 4:21 PM IST
Madanapalle
X

Madanapalle: సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌పై వైసీపీ నిర్లక్ష్యం – ఆర్‌జే వెంకటేష్ ధ్వజం

మదనపల్లె: మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చేందుకు చిప్పిలి, గుట్టకాడపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది నాటి తెలుగుదేశం ప్రభుత్వమేనని టీడీపీ సీనియర్ నాయకులు ఆర్‌జే వెంకటేష్ అన్నారు. 2019–2024 మధ్య వైసీపీ ప్రభుత్వం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆయన ఆరోపించారు.

శనివారం నిమ్మనపల్లె సర్కిల్‌లోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్‌జే వెంకటేష్, శివకృష్ణ, రాజన్న, లోకేష్, రాంబాబు, ప్రకాష్, మల్లికార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌జే వెంకటేష్ మాట్లాడుతూ.. 2006లోనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం కోసం రూ.20 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

అప్పట్లో కేవలం స్పిల్‌వే పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, అనంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు. 2019–2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కోసం ఎంత నిధులు ఖర్చు చేసిందో నిస్సార్ అహమ్మద్ ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.

ప్రాజెక్టు పనులు పూర్తికాకముందే పైప్‌లైన్ పనులు చేపట్టి, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో భారీగా ఖర్చు చేశారని ఆరోపించారు. కేవలం పైప్‌లైన్ పనులకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. ఎంపీ నిధులతో చిప్పిలికి నీరు రాకుండా రిటైనింగ్ వాల్ మాత్రమే నిర్మించారని ఆర్‌జే వెంకటేష్ పేర్కొన్నారు.

అలాగే చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండిన సమయంలో బ్యాక్‌వాటర్ వ్యవసాయ భూముల్లోకి రాకుండా మరవలు తెగ్గొట్టిన ఘటనలు కూడా జరిగాయని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని నిసార్ అహమ్మద్‌కు హితవు పలికారు.

అదేవిధంగా డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమని ఆర్‌జే వెంకటేష్ ఎద్దేవా చేశారు. ఇకనైనా ఏ అంశంపైనైనా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. రెండు లక్షల జనాభా కలిగిన మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని ఆర్‌జే వెంకటేష్ తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story