Kuppam: కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అమరనాథ్ ప్రభుత్వ అక్రమ కేసుపై విచారణ
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం కోర్టుకు 2021 నాటి శాంతిపురం అక్రమ కేసు విషయమై పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి, సీఎం చంద్రబాబు మాజీ పీఏ మనోహర్ హాజరయ్యారు.
Kuppam: కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అమరనాథ్ ప్రభుత్వ అక్రమ కేసుపై విచారణ
కుప్పం: వైకాపా హయాంలో బనాయించిన ఓ కేసుకు సంబంధించి కుప్పం అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డితో పాటు కుప్పం తెలుగు తమ్ముళ్ళు సోమవారం హాజరయ్యారు.
గత ప్రభుత్వంలో 2021 ఏడాది శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రైతుల శ్రేయస్సు కొరకు నిర్వహించిన ర్యాలీకి సంబంధించి అప్పటి చెంగుబల్ల వీఆర్వో రామిరెడ్డి ఫిర్యాదు మేరకు (క్రైమ్ నెం.191/2021) రాళ్ళ బుదుగూరు పోలీస్ స్టేషన్ లో 28 మందిపై అక్రమంగా కేసు నమోదైంది. ఇందులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా అక్రమ సమూహముగా ఏర్పడి అకస్మాత్తుగా రోడ్డు పైన బైఠాయించి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని నినాదాలు చేస్తూ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా ఆపివేసి జాతీయ రహదారిని దిగ్బంధించారని ఫిర్యాదు చేయడం జరిగింది.
అదేవిధంగా ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి రోడ్డుపై వాహనములను ఆపి ప్రజా రవాణాకు ప్రజాశాంతికి భంగము కలిగించారని, దాంతోపాటు బలవంతంగా పండ్లు కూరగాయల దుకాణాలను మూయించి కరోనా నిబంధనలను ఉల్లంఘించి వ్యాధి వ్యాప్తి చెందే విధంగా ప్రవర్తించారని కేసు పెట్టడమైంది. ఈ కేసులో ఏ-1 గా ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఉండగా, సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పీ. మనోహర్, ప్రస్తుత ఆర్టీసీ రిజినల్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తో సహా 25 మంది మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులోని మరో ముగ్గురు మృతి చెందడంతో వారు మినహా మిగిలిన అందరూ కోర్టుకు హాజరుకావడం జరిగింది.
ఈ నెల 17వ తేదికి కేసు వాయిదా వేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. దీంతో కుప్పం కోర్టు ఆవరణ పలమనేరు, కుప్పం నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లతో సందడిగా కనిపించింది.




