Madanapalle: మదనపల్లె ఘనంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ
Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పెద్దకూరపల్లిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని నేతల పిలుపు.
Madanapalle: మదనపల్లె ఘనంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం పెద్దకూరపల్లి పంచాయతీ పరిధిలోని మట్లివారిపల్లిలో బుధవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల ఎంపీపీ వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు సి.హెచ్. రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ రెడ్డెప్ప నాయుడు, మండల మైనార్టీ అధ్యక్షుడు సర్దార్ భాషా, హరి నాయుడు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఓటరు జాబితాలో పేర్లు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను అధికారులు ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలించి, ప్రజలకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ సభ్యులు సి.హెచ్. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు.
పేరు నమోదు కాకపోయినా లేదా వివరాల్లో తప్పులు ఉన్నా వెంటనే సరిదిద్దించుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మండల ఎంపీపీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కోరారు. అధికారులు నిబంధనల ప్రకారం పారదర్శకంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. గ్రామస్థులు అవసరమైన పత్రాలతో ముందుకు వచ్చి తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని తెలిపారు.




