Srikalahasti: మెగా డీఎస్సీపై వైసీపీ దొంగ ధర్నాలు.. ఎమ్మెల్యే ఫైర్!

Srikalahasti: మెగా డీఎస్సీపై వైసీపీ నేతల ఆరోపణలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 2 Jun 2026 9:19 PM IST
Srikalahasti
X

Srikalahasti: మెగా డీఎస్సీపై వైసీపీ దొంగ ధర్నాలు.. ఎమ్మెల్యే ఫైర్!

Srikalahasti: మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క మెగా డీఎస్సీ కూడా నిర్వహించకుండా, “జాబ్ క్యాలెండర్” పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన నాయకులు నేడు డీఎస్సీపై మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారని గుర్తుచేశారు. కేవలం 148 రోజుల్లోనే 15,941 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు జగన్ రెడ్డి అండ్ కో ప్రోత్సాహంతో 241 వరకు కోర్టు కేసులు వేయించినప్పటికీ, ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గకుండా పూర్తి పారదర్శకంగా, చట్టబద్ధంగా నియామకాలను పూర్తి చేసిందన్నారు. దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన సంస్థ TCS iON ఆధ్వర్యంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడంతో కోర్టులు సైతం నియామకాలపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెప్పారు.

అభ్యర్థుల మెరిట్ జాబితాలు, ర్యాంకులు,రిజర్వేషన్ల అమలు,ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను బహిరంగంగా వెబ్‌సైట్‌లో ఉంచి పూర్తి పారదర్శకత పాటించామని తెలిపారు.ఎస్సీ వర్గీకరణ,మహిళలు,దివ్యాంగుల రిజర్వేషన్ల అమలులో కూడా ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరించిందన్నారు.

అయితే ప్రస్తుతం కడప జిల్లాలో వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఆదిత్య రెడ్డి తదితరులు డీఎస్సీ పేరుతో దొంగ ధర్నాలు, రాజకీయ డ్రామాలకు తెరలేపడం వారి నిరాశకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం నిరుద్యోగ యువత పేరును వాడుకుంటూ మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఉద్యోగాలు పొందిన యువత తరఫున మాట్లాడుతున్నట్లు నటించడం ప్రజలను మోసం చేసే మరో నాటకమని అన్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం, ఉపాధ్యాయులను రెచ్చగొట్టడం, అసత్య ప్రచారాలతో గందరగోళం సృష్టించడం వెంటనే మానుకోవాలని హెచ్చరించారు.

జగన్ రెడ్డి దర్శకత్వంలో జరుగుతున్న ఈ రాజకీయ విన్యాసాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని రాష్ట్ర యువత స్పష్టంగా గుర్తిస్తోందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. వైసీపీ గత ఐదేళ్ల వైఫల్యాలు, నిరుద్యోగ యువత పట్ల చేసిన అన్యాయాన్ని ప్రజలు మర్చిపోలేదని,తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలన్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.

“ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిన వైసీపీకి, ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత లేదు. మెగా డీఎస్సీ విజయాన్ని చూసి వైసీపీ నేతలు రాజకీయ అసూయతో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story