Sullurupeta: సూళ్ళూరుపేటలో ‘ఆటో రక్ష’ పథకం ప్రారంభం
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలోని వీనస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆటో కార్మికుల కోసం 'ఆటో రక్ష' పేరుతో ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది.
Sullurupeta: సూళ్ళూరుపేటలో ‘ఆటో రక్ష’ పథకం ప్రారంభం
సూళ్ళూరుపేట: సూళ్ళూరుపేటలోని వీనస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద 'ఆటో రక్ష' పేరుతో ప్రత్యేక ఆరోగ్య పథకాన్ని ఆసుపత్రి అధినేత డాక్టర్ కే వెంకన్న బాబు ప్రారంభించారు. ఆటో కార్మికుల సేవలను గుర్తిస్తూ, వారి ఆరోగ్య భద్రత కోసం తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా సుమారు 500 మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు లబ్ధి పొందనున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ వెంకన్న బాబు మాట్లాడుతూ, ఆటో రక్ష పథకం ద్వారా ఆటో డ్రైవర్లతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ వీనస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉచిత ఓపీ సేవలు అందించడంతో పాటు, మందుల కొనుగోలు మరియు ల్యాబ్ పరీక్షలపై ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు సుమారు 400 మంది ఆటో డ్రైవర్లకు కుట్టించిన ఖాకీ యూనిఫాంలను ఆయన ఉచితంగా పంపిణీ చేశారు. ఆటో కార్మికుల ఆరోగ్యమే వారి కుటుంబాల భవిష్యత్తుకు బలమైన ఆధారమని పేర్కొన్న ఆయన, మద్యం సేవించి వాహనాలు నడపడం, ధూమపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని డ్రైవర్లకు హితవు పలికారు.
ఈ పథకం అమలుకు కృషి చేసిన సీఐటీయూ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు కె. లక్ష్మయ్య, కార్యదర్శి సుబ్రమణ్యంతో పాటు మండల ఆటో యూనియన్ కమిటీ అధ్యక్షుడు ఎ. వెంకటేశ్వర్లు, కార్యదర్శి డి. వెంకటరమణ, మధు, శివ, భాస్కర్, వెంకటేశ్వర్లు, వెంకట కిషోర్ మరియు ఆసుపత్రి మేనేజర్ కిరణ్, గౌతమి, రాజకుమారి తదితరులను డాక్టర్ వెంకన్న బాబు ప్రత్యేకంగా అభినందించారు.
ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఆసుపత్రి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆటో డ్రైవర్లందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి. నిరంతరం రోడ్లపై తిరిగే ఆటో డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.




