Hyderabad: కుప్పకూలిన బాల్కనీ.. ఇద్దరి మరణం.. ఒకరికి తీవ్ర గాయాలు
Hyderabad: హైదరాబాద్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కుందన్ బాగ్ లో ఒక అపార్ట్మెంట్ బాల్కనీ కూలిపోవడంతో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మృతి చెందారు.
Hyderabad
Hyderabad: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. బాల్కానీ కూలిపోవడంతో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మరణించగా, ఫ్లాట్ యజమాని తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హైదరాబాద్ లో పాత అపార్ట్మెంట్ భవనాల భద్రతపై కొత్త ఆందోళనలు తలెత్తాయి. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్బాగ్లో ఉన్న శ్రీవత్స అపార్ట్మెంట్స్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భవనం మూడవ అంతస్తులో విస్తరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ద్వారకప్రసాద్ ఫ్లాట్ లో ఎలక్ట్రిక్ పనుల కోసం ఎలక్ట్రీషియన్లు దేవిదాస్, అతని కుమారుడు వివేక్ లు అక్కడికి వచ్చారు. ఆ పనులకు సంబంధించి ముగ్గురు బాల్కానీలో కూచుని మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఇనుప కడ్డీలతో ఉన్న ఆస్లాబ్ కూలిపోయింది.
దీంతో ముగ్గురూ మూడో అంతస్తునుంచి కిందకు పడిపోయారు. ఈ దురదృష్టకర ఘటనలో వివేక్ అక్కడిక్కడే మరణించాడు. అతని తండ్రి దేవి దాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇక ఫ్లాట్ యజమాని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ, ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటన పాత అపార్ట్మెంట్స్ భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. గతంలో కూడా హైదరాబాద్ లో పాత అపార్ట్మెంట్స్ కూలిపడిన సంఘటనల్లో మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంఘటన కూడా ఇప్పుడు అందరిలోనూ ప్రశ్నలు లేవనెత్తుతోంది.




