Crime News: తల్లిని కొట్టిందని భార్యను కిరాతకంగా చంపేశాడు
Crime News: తన తల్లిని కొడుతుందని ఆగ్రహంతో ఒక భర్త తన భార్యను కిరాతకంగా చంపేశాడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News
Crime News: తన తల్లిని కొట్టిందని భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అంతేకాకుండా, భార్య మృతదేహాన్ని కొండ మీద నుంచి పారేసి తన నేరం నుంచి తప్పించుకోవాలని చూశాడు ఆ నిందితుడు. సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, చందౌలిలో ఒక కార్ షోరూమ్ ఫైనాన్షియర్ తన 28 ఏళ్ల భార్యను చేతి పంపు హ్యాండిల్తో కొట్టి చంపాడు. సాక్ష్యాలను నాశనం చేయడానికి, అతను మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, సంచిలో కుక్కి, కారు ఉన్న ప్రదేశానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత ప్రాంతంలోని ఒక కందకంలో పడేశాడు. తర్వాత అతను కారును కార్ సర్వీస్ ఏజెన్సీలో వదిలి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆదివారం ఉదయం, హతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన భర్తను, అతని తండ్రిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ ఘటనలో ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది, ఆమెకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ ఘటన సదర్ కోత్వాలి ప్రాంతంలోని బిచియా ఖుర్ద్ గ్రామంలో జరిగింది.
2020లో వివాహం..
బిచియా ఖుర్ద్ గ్రామానికి చెందిన గౌతమ్ కుమార్ ఖర్వార్ (అలియాస్ బాచా), చందౌలి మార్కెట్లోని హ్యుందాయ్ కార్ షోరూమ్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తాడు. అతని తండ్రి రామ్ లఖన్, సకల్దిహా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్యూన్గా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత కూడా ఆయన తహసీల్లో పనిచేస్తున్నారు. గౌతమ్ 2020లో సోనిని వివాహం చేసుకున్నాడు. వారికి తేజస్ అనే 5 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. సోని చకియా నగర పంచాయత్లోని మా కళినగర్ కాలనీలో నివసించేది.
కారణమిదే..
ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం గౌతమ్ తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. అతనికి పెళ్లి జరిగినదగ్గర నుంచి అతని తల్లిదండ్రులకు, భార్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. దీంతో గౌతమ్ వేరేగా నివాసం ఉంటున్నాడు. అయితే, సోనీ తరచూ తన భర్తను, కొడుకును తరచూ కొడుతుండేది. ఎప్పుడు వారి మధ్య తగాదాలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో శనివారం సోనీ తమ ఇంటికి వచ్చిన అత్త మీరాదేవిపై చేయి చేసుకుంది. దీంతో గౌతమ్ కుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అతను మొదట తన భార్యను ఆపడానికి ప్రయత్నించాడు. ఆమె ఆగకపోవడంతో.. అతను దగ్గరలో ఉన్న చేతిపంపు హ్యాండిల్తో ఆమెపై దాడి చేశాడు. ఫలితంగా ఆమె మరణించింది. ఆ సమయంలో గౌతమ్ తండ్రి, రామ్ లఖన్, ఇంట్లో లేరు. ఆయన సకల్దిహా తహసీల్లో ఉన్నారు.
ఆదివారం సోనీ అక్కలు సోనమ్, పింకీలకు ఈ విషాద వార్త తెలిసింది. వారు తమ బావ గౌతమ్కు ఫోన్ చేసి సోనీతో మాట్లాడాలని కోరారు. కానీ గౌతమ్ నిరాకరించాడు. ఇతర కుటుంబ సభ్యులు కూడా సోనీతో మాట్లాడే వారి ప్రయత్నాలను ఆలస్యం చేస్తూనే ఉన్నారు.
దీంతో, ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ కుటుంబాలతో కలిసి సోని అత్తగారింటికి చేరుకుని, జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు తమ సోదరుడు సంజయ్తో కలిసి సదర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి, నిందితులపై హత్య కేసు నమోదు చేశారు.
పోలీసు బృందం వెంటనే రంగంలోకి దిగింది. వారు ఇంటిపై దాడి చేసి, నిందితుడు గౌతమ్ కుమార్ ఖర్వార్ను, అతని తండ్రి రామ్ లఖన్ను అరెస్టు చేశారు. చకియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండ ప్రాంతమైన జిలేబియా మోర్ సమీపంలోని పొదల్లో పోలీసులు సోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వారం క్రితం అంతా బాగానే ఉంది..
వారం క్రితం గౌతమ్, సోని బీహార్లోని మా తుట్లా భవానీ ఆలయాన్ని సందర్శించారని సోని చెల్లెలు పింకీ చెప్పింది. మూడు రోజుల క్రితం ఫోన్ సంభాషణలో సోని మామూలుగా, సంతోషంగానే ఉన్నట్టు మాట్లాడింది అని చెప్పింది. సోనీతో మాట్లాడటానికి రెండురోజులుగా ప్రయత్నిస్తున్నా, అవకాశం కుదరలేదు. దీంతో అనుమానం వచ్చి అక్కడకు వెళ్లి చూడగా.. సోనీ ఐదేళ్ల కొడుకు తన తండ్రి అమ్మను కొట్టి కారులో తీసుకువెళ్లాడని చెప్పాడు. డీఎంతో పోలీసులకు ఫిర్యాదు చేశాము అని సోనీ అక్క సోనమ్ చెప్పింది.
భార్యాభర్తల మధ్య గొడవ..
ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు సీఓ దేవేంద్ర కుమార్ తెలిపారు. కొండ ప్రాంతంలోని పొదల్లో మహిళ మృతదేహం లభ్యమైంది. నిందితుడిని, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భార్యాభర్తల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు వెల్లడైంది. నిందితుడు సోనిని కొట్టిన చేతి పంపు హ్యాండిల్ను పోలీసు బృందం స్వాధీనం చేసుకుంది.




