Germany Shooting : ఆశ్రమంలో రక్తపాతం.. ఆరుగురిని బలిగొన్న కస్టడీ వివాదం.!
Germany Shooting : జర్మనీలో గుండెల్ని పిండేసే ఘోర ఉదంతం ఒకటి వెలుగుచూసింది. ఉత్తర జర్మనీలోని హాంబర్గ్ నగరానికి సమీపంలో ఉన్న స్టాడ్ పట్టణంలో సోమవారం ఒక వ్యక్తి
Germany Shooting
Germany Shooting : జర్మనీలో గుండెల్ని పిండేసే ఘోర ఉదంతం ఒకటి వెలుగుచూసింది. ఉత్తర జర్మనీలోని హాంబర్గ్ నగరానికి సమీపంలో ఉన్న స్టాడ్ పట్టణంలో సోమవారం ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గర్భిణులు, చిన్న పిల్లల తల్లులకు రక్షణగా ఉండే ఒక ప్రభుత్వ ఆశ్రమంలో ఈ ఘోరకలి చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
కూతురి పెంపకం వివాదమే కారణం?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ ఘోరానికి పిల్లల పెంపకం (చైల్డ్ కస్టడీ) వివాదమే కారణమని తెలుస్తోంది. నిందితుడికి, అతని మాజీ భాగస్వామికి మధ్య మూడు నెలల కూతురి బాధ్యతలకు సంబంధించిన గొడవ నడుస్తోంది. ఈ విషయంపై చర్చించడానికి సదరు షెల్టర్ హోమ్లో సోమవారం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తన మూడు నెలల కూతురు, ఆమె తల్లి ముందే నిందితుడు ఒక్కసారిగా తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక 65 ఏళ్ల మహిళ డ్రైవ్ చేస్తున్న కారులో ఎక్కి వేగంగా పారిపోతుండగా పోలీసులు గమనించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆ కారును వెంబడించారు. కొద్ది దూరం సినిమా స్టైల్లో ఛేజ్ చేసిన తర్వాత నిందితుడితో పాటు కారు నడుపుతున్న మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని ప్రస్తుతం సీక్రెట్ లొకేషన్లో విచారిస్తున్నారు.
నిందితుడి నేపథ్యం ఏంటి?
పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడి వయసు 45 ఏళ్లు. ఇతను జర్మనీలోనే పుట్టి పెరిగినప్పటికీ, టర్కీ దేశ మూలాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. గతంలో కొందరిని బెదిరించిన కేసుల్లో పోలీసు రికార్డుల్లో ఇతని పేరు ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఇంతటి ఘోరానికి ఒడిగడతాడని తాము ఊహించలేదని, అతనిపై ఇదివరకు పెద్ద క్రిమినల్ హిస్టరీ ఏమీ లేదని పోలీసులు చెబుతున్నారు.
కన్నీరు మున్నీరవుతున్న స్థానికులు
అనాథలు, బాధితులకు ఆశ్రయం ఇచ్చే అత్యంత సురక్షితమైన చోట ఇంతటి దారుణం జరగడంపై జర్మనీ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమాయకుల ప్రాణాలు పోవడంపై స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదం జరిగిన ఆశ్రమం వద్దకు భారీగా చేరుకున్న ప్రజలు కొవ్వొత్తులు వెలిగించి, పూలు ఉంచి బాధితులకు నివాళులు అర్పిస్తున్నారు.




