LB Nagar: ఎల్బీనగర్లో దారుణం.. చెరువులో ముంచి 9 నెలల చిన్నారి హత్య!
LB Nagar: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్గూడ చెరువులో కల్లు మత్తులో ఉన్న తల్లి రాజేశ్వరి తన 9 నెలల కుమార్తె అనురాధను నీటిలో ముంచి హత్య చేసింది.
LB Nagar: ఎల్బీనగర్లో దారుణం.. చెరువులో ముంచి 9 నెలల చిన్నారి హత్య!
LB Nagar: ఎల్బీనగర్:... అమ్మ ప్రేమకు ప్రతిరూపంగా నిలవాల్సిన తల్లి.. మానవత్వాన్నే మరిచి తన తొమ్మిది నెలల పసికందును చెరువులో ముంచి హత్య చేసిన హృదయ విదారక ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్గూడ చెరువు వద్ద ఆదివారం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన లోకసాని రవీందర్రెడ్డి, కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన రాజేశ్వరిని ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు ఇంజాపూర్లో నివాసముంటున్నారు. దంపతులకు తొమ్మిది నెలల కుమార్తె అనురాధ ఉంది. రవీందర్రెడ్డి బాటసింగారం పండ్ల మార్కెట్లో హమాలీగా పనిచేస్తుండగా, రాజేశ్వరి గృహిణి.
కుటుంబ బాధ్యతల విషయంలో రాజేశ్వరి నిర్లక్ష్యంగా వ్యవహరించేదని, చిన్నారిని తీసుకుని పలుమార్లు ఇంటి నుంచి వెళ్లి రెండు, మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
ఆదివారం కల్లు మత్తులో ఉన్న రాజేశ్వరి చిన్నారిని తీసుకుని బైరామల్గూడ చెరువులోకి వెళ్లి నీటిలో ముంచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు ఆమెను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న తండ్రి రవీందర్రెడ్డి తన కుమార్తె మృతదేహాన్ని హత్తుకుని బోరున విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పోలీసులు రాజేశ్వరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




