Human Trafficking : చదువు చెప్పిస్తామని నమ్మించి.. రూ.50 వేలకు బాలికను అమ్మేసిన కిరాతకులు.!
Human Trafficking : మనుషుల్లో మృగత్వం రోజురోజుకూ ఎలా పెరిగిపోతుందో చెప్పడానికి ముంబైలో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. హర్యానాకు చెందిన 14 ఏళ్ల..
mumbai minor girl sold prostitution racket arrest
Human Trafficking : మనుషుల్లో మృగత్వం రోజురోజుకూ ఎలా పెరిగిపోతుందో చెప్పడానికి ముంబైలో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. హర్యానాకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను ముంబైకి అక్రమంగా రవాణా చేసి, వ్యభిచార కూపంలోకి నెట్టి, నరకం చూపించిన దారుణ ఉదంతాన్ని మిరా భయాందర్ వసాయ్-విరార్ (MBVV) పోలీసులు శనివారం బట్టబయలు చేశారు. ఈ కేసులో ఇద్దరు దంపతులతో సహా మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చదువు చెప్పిస్తామనే అబద్ధపు హామీతో అంబాలా నుంచి తీసుకువచ్చిన ఆ బాలికను.. కేవలం రూ. 50,000లకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కిడ్నాప్ డ్రామా ఆడి.. తానే దొరికిపోయిన ప్రధాన నిందితుడు..
అసలు ఈ దారుణం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. మార్చి 3వ తేదీన సంజయ్ గుప్తా అనే సెక్యూరిటీ గార్డు (ప్రధాన నిందితుడు) తానే ఆ బాలికకు గార్డియన్నని చెప్పుకుంటూ భయాందర్లోని నవ్ఘర్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. హోలీ పండుగ సామాగ్రి కొనడానికి బయటకు వెళ్లిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని, ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వచ్చిన ఒక రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు భయాందర్ ఏరియాలోనే ఆ బాలికను గుర్తించి రక్షించారు.
మహిళా అధికారితో చిన్నారి చెప్పిన భయంకర నిజాలు..
బాలికను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన తర్వాత ఒక మహిళా పోలీస్ అధికారిణి ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని, నమ్మకం కలిగించి అసలేం జరిగిందో అడిగారు. అప్పుడు ఆ బాలిక చెప్పిన భయంకరమైన విషయాలు విని పోలీసులే షాక్ తిన్నారు. ఫిర్యాదు చేసిన సంజయ్ గుప్తా తనకు చుట్టం కాదని, హర్యానాలోని అంబాలాలో ఉన్న తన కుటుంబసభ్యులకు "నీ కూతురిని బాగా చదివిస్తా, నేను చూసుకుంటా" అని నమ్మించి ముంబై తీసుకువచ్చాడని ఏడ్చింది. ఇక్కడికి తెచ్చిన తర్వాత తనను వ్యభిచార కూపంలోకి నెట్టారని, సంజయ్ గుప్తాతో పాటు మరికొందరు నిందితులు తనపై పదే పదే అత్యాచారానికి ఒడిగట్టారని, వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పారిపోయానని ఆ చిన్నారి వివరించింది.
రూ. 50 వేలకు అమ్మకం.. సెక్స్ రాకెట్ గుట్టురట్టు..
సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ముకుంద్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నాప్ కేసును ఛేదిస్తున్న క్రమంలో ఒక పెద్ద సెక్స్ రాకెట్ నెట్వర్క్ బయటపడింది. నిందితులు ఆ బాలికను వ్యభిచారం కోసం రూ. 50 వేలకు అమ్ముకున్నట్లు తేలింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ చవాన్ మాట్లాడుతూ.. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, ఈ అక్రమ రవాణా , సెక్స్ రాకెట్తో సంబంధం ఉన్న ఎనిమిది మందిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారని తెలిపారు.
నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసులు..
అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కిడ్నాప్, అత్యాచారం, పెళ్లి లేదా ఉద్యోగం పేరుతో మోసం చేయడం వంటి సెక్షన్లతో పాటు, మైనర్ బాలికపై దారుణానికి ఒడిగట్టినందుకు గానూ అత్యంత కఠినమైన 'పోక్సో' (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఒక మిస్సింగ్ కేసుగా మొదలైన విచారణ.. చివరకు ఒక బాలిక ప్రాణాలను కాపాడటంతో పాటు ఇంతటి ఘోరమైన నల్లబజారు ముఠాను కటకటాల్లోకి నెట్టడానికి కారణమైంది. ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.




