Child Assault : మనిషా..? మృగమా..? పాపకు బిస్కెట్ ఆశ చూపి.. పొదల్లోకి తీసుకెళ్లి దారుణం.!
Child Assault : తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఒక మూడేళ్ల చిన్నారి..
Child Assault
Child Assault : తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయిన ఒక మూడేళ్ల చిన్నారి.. పొదల్లో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆ పసికందుపై లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోరానికి కారణమైన బీహార్కు చెందిన 19 ఏళ్ల వలస కూలీ విబిన్ మంచ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి నమ్మించాడు
బాధితురాలైన చిన్నారి కుటుంబం, అలాగే నిందితుడు విబిన్ ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ నివసిస్తున్న వలస కార్మికులే. రోజూలాగే ఆ పాప ఇంటి బయట ఆడుకుంటుండగా, నిందితుడు బిస్కెట్ ప్యాకెట్ ఆశ చూపి గదిలోకి తీసుకెళ్లడం ఒక పొరుగు మహిళ చూసింది. అయితే వారిద్దరూ తెలిసిన వారే కావడంతో ఆమె మొదట అనుమానించలేదు. సాయంత్రం 6 గంటలైనా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లి వెతకడం ప్రారంభించింది. అదే సమయంలో ప్రకృతి పిలుపు కోసం సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లిన స్థానికులకు ఆ చిన్నారి తీవ్ర గాయాలతో, నిస్సహాయ స్థితిలో పడి ఉండటం కనిపించింది. వెంటనే ఆమెకు నీళ్లు తాపించి ఆసుపత్రికి తరలించినప్పటికీ, అంత చిన్న వయసులో ఆ గాయాలను తట్టుకోలేక ఆ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది.
రాజకీయంగా పెరిగిన వేడి
తమిళనాడులో మహిళలు, చిన్న పిల్లలపై వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘోరాలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ శాంతిభద్రతల అంశం ప్రధానంగా నిలిచింది. ఈ ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. మూడేళ్ల పాపను పొదల్లో పడేసిన వార్త విని తన రక్తం గడ్డకట్టుకుపోయిందని 'X' (ట్విట్టర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమవుతున్నాయని, మహిళలు తమ పిల్లల రక్షణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వంపై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు
ఈ దారుణ ఉదంతంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం విజయ్ పాలనలో మహిళలు, పిల్లలపై నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. సీఎం వెంటనే ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. అయితే, ప్రభుత్వం మహిళల రక్షణ కోసం 'సింగప్పెణ్' అనే ప్రత్యేక మహిళా రక్షణ దళాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ దారుణం జరగడం అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




