Mustabad: అప్పుల భారం తాళలేక ఒకేరోజు ఇద్దరు ఆత్మహత్య!
Mustabad: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతో ఒకేరోజు ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య. పోతుగల్, ఆవునూర్ గ్రామాల్లో విషాదం.
Mustabad: అప్పుల భారం తాళలేక ఒకేరోజు ఇద్దరు ఆత్మహత్య!
Mustabad: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అప్పుల భారం మరోసారి రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ముస్తాబాద్ మండలంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మొదటి ఘటనలో పోతుగల్ గ్రామానికి చెందిన ఈరవేణి పరశురాములు (42) తన రెండెకరాల పొలంలో బోర్లు వేసినా నీరు రాక వ్యవసాయం సాగించలేకపోయాడు. పంటలు దెబ్బతినడంతో అప్పుల పాలయ్యాడు. ఉపాధి కోసం కుమారుడిని కువైట్కు పంపించినప్పటికీ ఆశించిన ఆదాయం రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మరో ఘటనలో ఆవునూర్ గ్రామానికి చెందిన బండి లావణ్య (38) కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లినా సరైన ఆదాయం లేక ఇంటికి డబ్బులు పంపలేకపోయాడు. ఇద్దరు కుమారుల చదువుల ఖర్చులు, చేసిన అప్పుల భారం భరించలేక లావణ్య కూడా ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఈ రెండు ఘటనలు ఒకే రోజు జరగడంతో ముస్తాబాద్ మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా, గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.




