ఐఐటీ ఢిల్లీలో ఎడ్జ్ ఏఐ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రారంభం
ఐఐటీ ఢిల్లీలో ఎడ్జ్ ఏఐ ల్యాబ్ ప్రారంభమైంది. విద్యార్థులకు ఏఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్లో ప్రాక్టికల్ శిక్షణ అందించనున్నారు.
ఐఐటీ ఢిల్లీలో ఎడ్జ్ ఏఐ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రారంభం
కృత్రిమ మేధస్సు (AI), ఎంబెడెడ్ సిస్టమ్స్లో విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ కొత్త ఎడ్జ్ AI ఇన్వెన్షన్ ల్యాబ్ను ప్రారంభించింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలోని స్టూడెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ (SIL)లో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
ఓపెన్ సోర్స్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ Arduino సహకారంతో ‘ఫిజికల్ AI ఫర్ ఆల్’ కార్యక్రమంలో భాగంగా ఈ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఎడ్జ్ AI విద్యను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.
క్వాల్కామ్ టెక్నాలజీస్ సీనియర్ డైరెక్టర్, సేల్స్ గునీత్ బేడీ IIT ఢిల్లీని సందర్శించిన సందర్భంగా ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ శంకర్ ప్రక్రియతో పాటు ప్రొఫెసర్లు శుభేందు భాసిన్, అమర్తాంశ్ దూబే, కౌశిక్ సాహా తదితరులు పాల్గొన్నారు.
రియల్ టైమ్ ప్రాజెక్టులకు అవకాశం
ఎడ్జ్ AI, ఫిజికల్ AI టెక్నాలజీల ఆధారంగా వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు రూపొందించే ప్రాజెక్టులను విద్యార్థులు అభివృద్ధి చేసుకునేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడుతుందని IIT ఢిల్లీ తెలిపింది. ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, హ్యాకథాన్లు, పరిశ్రమల భాగస్వామ్యాల ద్వారా విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పించనున్నారు.
AI, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు ఉన్నత విద్యలో ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ల్యాబ్ ఏర్పాటు ప్రాధాన్యం సంతరించుకుంది. తరగతి గదిలో నేర్చుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్ అప్లికేషన్లతో అనుసంధానించేందుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.
120 గంటల ఎడ్జ్ AI కోర్సు
Arduino, విద్యా భాగస్వామి STEMLORE Innovators సహకారంతో 120 గంటల క్రెడిట్ ఆధారిత ఎడ్జ్ AI కరిక్యులమ్ను కూడా రూపొందించింది. ఇందులో ల్యాబొరేటరీ మాన్యువల్స్, బోధనా వనరులు, ప్రాజెక్ట్ కిట్లు, ఫ్యాకల్టీ శిక్షణ వంటి అంశాలను చేర్చారు.
దేశంలోని విద్యాసంస్థల్లో ఎడ్జ్ AI ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్న విస్తృత కార్యక్రమంలో IIT ఢిల్లీ ల్యాబ్ కూడా భాగమని సంస్థ తెలిపింది. ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు కాగా, రానున్న నెలల్లో మరిన్ని ల్యాబ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు ఉన్నట్లు వెల్లడించింది.




