IIT: దేశంలో తొలి ఐఐటీ ఏదో తెలుసా.? జైలు నుంచి మొదలైన విద్యా సంస్థ చరిత్ర
IIT: దేశంలో అత్యున్నత విద్యాలయాల్లో ఐఐటీ ప్రథమ స్థానంలో ఉంటుందని తెలిసిందే. IITల్లో సీటు సాధించడం విద్యార్థులు కలగా భావిస్తారు.
IIT
IIT: దేశంలో అత్యున్నత విద్యాలయాల్లో ఐఐటీ ప్రథమ స్థానంలో ఉంటుందని తెలిసిందే. IITల్లో సీటు సాధించడం విద్యార్థులు కలగా భావిస్తారు. కానీ దేశంలో తొలి IIT ఒక ఆధునిక భవనంలో కాకుండా, బ్రిటిష్ కాలం నాటి జైలు శిబిరంలో ప్రారంభమైందని మీకు తెలుసా.?
దేశానికి సాంకేతిక విద్య అవసరమని భావించిన ప్రభుత్వం
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే, 1946లో దేశ అభివృద్ధికి ఉన్నత సాంకేతిక విద్య చాలా అవసరమని గుర్తించారు. దీనికోసం ఎన్.ఆర్. సర్కార్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ దేశంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని సూచించింది. అక్కడ కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా పరిశోధనలు, నాణ్యమైన అధ్యాపకులు కూడా తయారవ్వాలని పేర్కొంది. ఈ సిఫార్సుల ఆధారంగానే దేశ తొలి IIT ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది.
కోల్కతా నుంచి హిజ్లీ వరకు IIT ప్రయాణం
1950 మేలో తొలి IIT ప్రారంభమైంది. మొదట కోల్కతాలోని ఎస్ప్లానేడ్ ఈస్ట్ ప్రాంతంలోని ఒక భవనంలో తరగతులు నిర్వహించారు. అయితే కొద్ది నెలల తర్వాత ఖరగ్పూర్లోని హిజ్లీ ప్రాంతానికి సంస్థను తరలించారు.
1951 ఆగస్టు 18న అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధికారికంగా సంస్థను ప్రారంభించారు. అప్పటికే దీనికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే పేరు ఖరారు చేశారు. తర్వాత ఈ సంస్థ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక IITగా ఎదిగింది.
స్వాతంత్ర సమరయోధులు బందీలుగా ఉన్న జైలు నుంచే ప్రారంభం
IIT ఖరగ్పూర్ ప్రారంభమైన హిజ్లీ భవనం అసలు బ్రిటిష్ కాలంలో డిటెన్షన్ క్యాంప్గా ఉపయోగించేవారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న యువకులను ఇక్కడ విచారణ లేకుండానే నిర్బంధించేవారు. 1931 సెప్టెంబర్ 16న ఈ జైలులో నిర్బంధంలో ఉన్న సంతోష్ కుమార్ మిత్రా, తారకేశ్వర్ సేన్గుప్తా అనే ఇద్దరు యువకులను బ్రిటిష్ పోలీసులు కాల్చిచంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడికి వెళ్లి వారి మృతదేహాలను స్వీకరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సహా పలువురు జాతీయ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అదే చారిత్రాత్మక భవనం తర్వాత విద్యాలయంగా మారడం విశేషం.
224 మంది విద్యార్థులతో మొదలై జాతీయ ప్రాధాన్య సంస్థగా ఎదిగిన IIT
1951లో మొదటి విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పుడు IIT ఖరగ్పూర్లో కేవలం 224 మంది విద్యార్థులు, 42 మంది అధ్యాపకులు మాత్రమే ఉన్నారు. ప్రారంభంలో 10 విభాగాలతో బోధన సాగింది. తరగతులు, ల్యాబ్లు, కార్యాలయాలన్నీ అదే చారిత్రాత్మక భవనంలో నిర్వహించేవారు.
1952లో జవహర్లాల్ నెహ్రూ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత క్రమంగా క్యాంపస్ విస్తరించింది. స్విస్ ఆర్కిటెక్ట్ డాక్టర్ వెర్నర్ మోసర్ పర్యవేక్షణలో క్యాంపస్ రూపకల్పన జరిగింది. దేశ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ఆధునిక యంత్రాలను తీసుకువచ్చారు. ఆ కాలంలో IIT ఖరగ్పూర్ వర్క్షాప్ దేశంలోనే అత్యుత్తమంగా పేరొందింది. ప్రముఖ శాస్త్రవేత్త జే.సీ. ఘోష్ తొలి డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి సంస్థకు బలమైన పునాది వేశారు.
1956 సెప్టెంబర్ 15న పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా IIT ఖరగ్పూర్ను “జాతీయ ప్రాధాన్య సంస్థ”గా ప్రకటించింది. తర్వాత ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయ హోదాను కూడా పొందింది.




