Chintoor: గోదావరి ప్రమాద బాధితులకు ఐటీడీఏ తక్షణ సాయం
Chintoor: గోదావరి నది ప్రమాద మృతుల కుటుంబాలను చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నోఖ్వాల్ రాత్రి వేళ స్వయంగా పరామర్శించారు.
Chintoor: గోదావరి ప్రమాద బాధితులకు ఐటీడీఏ తక్షణ సాయం
Chintoor: గోదావరి నదిలో మృతి చెందిన మృతుల కుటుంబ సభ్యులను చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి శుభం నోక్వాల్ పరామర్శించారు.మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఉదయం రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన రాలేకపోయానని తెలిపారు. అందుకే రాత్రి సమయంలో వచ్చి పరామర్శించడం జరుగుతుందని తెలిపారు.
ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రతి మృతుని కుటుంబాన్ని విడివిడిగా కలిసి వారి యోగక్షేమాలను విచారించి, మనోధైర్యాన్ని కల్పించారు. ప్రతి మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.25,000 చొప్పున అందజేశారు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేమని, అయితే ప్రభుత్వం అన్ని విధాలుగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
అదేవిధంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం మంజూరు చేయించేందుకు సమగ్ర ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపనున్నట్లు హామీ ఇచ్చారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నేటి నుంచి గోదావరి నదిలో చేపల వేటను నిలిపివేయాలని గ్రామస్తులకు సూచించారు.
ప్రాణాల కంటే విలువైనది మరేదీ లేదని, ప్రతి ఒక్కరూ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని శుభం నోఖ్వాల్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎటపాక మండల తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎటపాక సీఐ వి.కృష్ణ, ఎస్ఐ అప్పలరాజు, ఎంపీడీఓ విజయ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




