Velerupadu: వేలేరుపాడు అడవుల్లో భారీ కబ్జా!
Velerupadu: కుక్కునూరు రేంజ్ రుద్రంకోట బీట్లో 35 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ కబ్జా. టేకు, మద్ది చెట్లను నరికేసినా పట్టించుకోని అటవీశాఖ అధికారులపై చర్యలకు డిమాండ్.
Velerupadu: వేలేరుపాడు అడవుల్లో భారీ కబ్జా!
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కుక్కునూరు అటవీ రేంజ్ పరిధిలోని రుద్రంకోట బీట్ లో ఉన్న అటవీ భూమిపై కొందరు ఆక్రమణదారుల కన్ను పడింది. రిజర్వ్ ఫారెస్ట్ ను పోడు నరికి ఆ భూమిని పోడు సాగు చేసెందుకు రుద్రంకోట బీట్ పరిధిలోని పోచారం గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో సుమారు 20 ఎకరాలు, చింతలపాడు గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లోని సుమారు 15 ఎకరాలు వెరసి సుమారు 35 ఎకరాల పైనే పోడు నరకి అటవీ భూముల ఆక్రమణకు కొందరు వ్యక్తులు పాల్పడుతున్న స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అధికారులకు తెలియకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోడు నరికిన అటవీ భూముల్లో భారీగా ఏపుగా పెరిగిన టేకు, సిరమాను, మద్ది, బిల్లుడు, వంటి ఏండ్ల నాటి భారీగా పెరిగిన వృక్షాలను మిషన్లతో కోసి తరలించి సొమ్ము చేసుకుంటున్నా స్థానికంగా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రికా మాధ్యమాల్లో వచ్చిన వార్తలకు స్పందించిన అధికారులు చింతలపాడు సమీపంలో పోడు నరికిన అటవీ ప్రాంతంలో ఎన్ని చెట్లు నరికారు అనే దాని మీద ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రారంభించగా కొన్ని చెట్ల మొదళ్లకు మాత్రమే నంబరింగ్ చేశారు.
మిగిలిన చెట్ల మొదళ్లకు నంబరింగ్ చేయకపోవడం, పోచారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నరికిన పోడును వదిలేసి, చింతలపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో నరికిన పోడులో మాత్రమే ఎన్యూమరేషన్ ప్రక్రియ మొదలు పెట్టి ఇప్పటికీ నెల రోజులు పైన కావస్తున్న ఆ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులను కాపాడేందుకు సంబంధిత అధికారులు ఎంక్వయిరీ ల పేరుతో కాలయాపన చేస్తున్నారని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. ఆక్రమణదారులకు, వారికి సహకరిస్తున్న స్థానిక అటవీ శాఖ అధికారులకురాజకీయ నాయకుల అండదండలు మెండుగా ఉండటం వల్లే రిజర్వ్ ఫారెస్ట్ లో అంత పెద్ద మొత్తంలో పోడు నరికిన స్థానికంగా విధులు నిర్వహించిన అధికారులపై చర్యలు ఉండవనే
ప్రచారం జోరుగా సాగుతోంది.
రిజర్వ్ ఫారెస్ట్ లోని వందలాది భారీ చెట్లను పంటల సాగు పేరుతో కొందరు అక్రమార్కులు నేలకూలుస్తుంటే స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులు ఆక్రమణదారుల నుంచి ముడుపులు తీసుకుని, అటవీ సంరక్షణ గాలికి వదిలేసి ఆఫీసులకే పరిమితం కావడంతో అటవీ భూముల ఆక్రమణలు జరుగుతున్నా vయనీ, స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే, అవి పాత పోడులని, పోడు నరుక్కుంటే మీకు వచ్చిన నష్టం ఏంటని అధికారులే అడుగుతున్నరని, అడవులను సంరక్షించాల్సిన అధికారులు అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్న ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని, స్థానికంగా విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఇప్పటికైనా జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించి ఆక్రమణదారులకు సహకరిస్తున్న స్థానిక అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.




