Tadepalli: బాబు, కరవు కవల పిల్లలు: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజం

Tadepalli: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరవు తాండవిస్తున్నా కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 11 Sept 2026 8:53 PM IST
Tadepalli
X

Tadepalli: బాబు, కరవు కవల పిల్లలు: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజం

తాడేపల్లి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరవు తాండవిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలై రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు. వర్షపాత లోటు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎటువంటి కంటింజెన్సీ ప్లాన్ లేదని దుయ్యబట్టారు. గత చరిత్రను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో 'చంద్రబాబు - కరవు' రెండూ కవల పిల్లల్లా కలిసి వస్తాయన్న నానుడి మరోసారి నిజమైందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... :

"బాబు – కరవు కవల పిల్లలు".

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కరవు వెంటే వస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. రాష్ట్రంలో దాదాపు 55 శాతానికి పైగా వర్షపాత లోటు ఉంది. ఎల్నినో పేరు చెప్పి కాలయాపన చేయడం తప్ప, రైతును ఆదుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికా లేదు. వరి వేయొద్దని చెప్పారు, తీరా చూస్తే వేరుశనగ, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు కాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాయలసీమలో 30 నుంచి 35 శాతం విస్తీర్ణంలో సాగే కాలేదు. నెల్లూరు బ్యారేజీ కింద వేసిన 3,500 ఎకరాల పంట నీళ్లు లేక ఎండిపోయింది. కృష్ణా డెల్టాలో నార్లు ఎండిపోయే దుస్థితి వచ్చింది.

"ప్రచార ఆర్భాటాలే తప్ప సాగునీటి నిర్వహణ శూన్యం".

చంద్రబాబుకు కొబ్బరికాయలు కొట్టడం, పూలు చల్లుకోవడం, ప్రచార ఫోటోలు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతుల పొలాలకు నీరివ్వడంపై లేదు. శ్రీశైలంలో నీళ్లున్నా రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమంగా నీళ్లివ్వలేని అసమర్థ పాలన ఇది. చివరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లు తెగిపడేంత దారుణంగా నిర్వహణను గాలికొదిలేశారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడానికే పరిమితం కానీ, రైతు సంక్షేమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఏమాత్రం సాటిరారు.

"రాత్రివేళ కరెంట్ కష్టాలు.. మళ్లీ పాత రోజులు".

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రాకముందు రైతులు రాత్రిపూట టార్చ్ లైట్లు పట్టుకుని పొలాల వెంట తిరిగిన చీకటి రోజులను చంద్రబాబు మళ్లీ గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత సృష్టించి రాత్రి 2 గంటలకు కరెంట్ ఇస్తున్నారు. వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు.

"పశుగ్రాసం లేక జీవాలు విక్రయం.. ఉచితంగా పశుగ్రాసం అందించాలి.

రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పశువులకు గడ్డి దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. గడ్డి మోపు ధర రూ. 200 నుంచి రూ. 300 దాటిపోయింది. పెంచిన పశువులకు మేత పెట్టలేక రైతులు వాటిని తెగనమ్ముకుంటున్నారు. ప్రభుత్వం చెరువుల్లో గడ్డి విత్తనాలు వేస్తామంటూ కాలయాపన చేస్తోంది తప్ప తక్షణ చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వం వెంటనే 100 శాతం సబ్సిడీతో రైతులకు ఉచితంగా పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలి.

"రైతాంగానికి తక్షణ పరిహారం చెల్లించాలి".

ఈ నేపథ్యంలో పంట వేసినా, వేయకపోయినా.. తీవ్ర కరవు, ప్రభుత్వ అసమర్థ నీటి విధానాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించడం తో పాటు,

రైతులపై భారం పడకుండా ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను బాధ్యతాయుతంగా గుర్తించి, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చినట్లే రూ. 7 లక్షల పరిహారాన్ని వెంటనే అందజేయాలని సాకే శైలజానాధ్ డిమాండ్ చేశారు .

చేసిన అప్పులన్నీ అమరావతి పేరుతో ఖర్చు చేయడం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అల్లాడుతున్న రైతులను, కరవు కోరల్లో చిక్కుకున్న పేదలను ఆదుకోవడానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.