Vinukonda: వినుకొండ మైనార్టీల అభివృద్ధికి సీఎం చంద్రబాబు సానుకూల స్పందన!
Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సీఎం చంద్రబాబు సానుకూల స్పందన.. వెల్లడించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.
Vinukonda: వినుకొండ మైనార్టీల అభివృద్ధికి సీఎం చంద్రబాబు సానుకూల స్పందన!
Vinukonda: వినుకొండ పట్టణంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి, మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినుకొండ మైనార్టీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మార్కజ్ మసీదు అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేయాలని, ముస్లిం మైనార్టీలకు ఉపయోగకరంగా ఉండేలా షాదీఖానా నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని జీవీ కోరారు. మైనార్టీ వర్గాల ప్రతినిధులు, మత పెద్దలతో కలిసి వారి సమస్యలను సీఎంకు వివరించినట్లు తెలిపారు.
అదేవిధంగా వినుకొండలో గ్రౌండ్ లెవల్ హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలని జీవీ విజ్ఞప్తి చేశారు. మ్యాపింగ్లో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా ఇబ్బందుల కారణంగా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అందకుండా ఉండకూడదని పేర్కొన్నారు.
వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని జీవీ ఆంజనేయులు తెలిపారు. మైనార్టీలకు అవసరమైన మౌలిక వసతులు, సామాజిక అవసరాలపై వారి ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు.వినుకొండ మైనార్టీల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని జీవీ తెలిపారు. పట్టణ అభివృద్ధిలో ప్రతి వర్గాన్ని భాగస్వామ్యం చేస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.




