Palnadu: కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వాట్సాప్ గవర్నెన్స్!
Palnadu: పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు.
Palnadu: కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా వాట్సాప్ గవర్నెన్స్!
పల్నాడు: ప్రజల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ప్రతి అర్జీపై తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. గురువారం వినుకొండలోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్కు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా పింఛన్లు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, భూ సమస్యలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన మొత్తం 34 అర్జీలు అందాయి. ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన జీవీ ఆంజనేయులు, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు.ప్రజలకు సుపరిపాలన, సమన్యాయం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వంగా గుర్తింపు పొందుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక ప్రభుత్వ సేవలు ఇంటి వద్ద నుంచే పొందే అవకాశం కల్పించామని వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు సేవల్లో నాణ్యత, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. అధికారులు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, సమస్యలను వెంటనే పరిష్కరించినప్పుడే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని జీవీ ఆంజనేయులు తెలిపారు.




