Guntur: జీవో నెం.33ను తక్షణమే ఉపసంహరించుకోవాలి!
Guntur: కిడ్నీ మార్పిడి నిబంధనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.33ను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ డిమాండ్ చేశారు.
Guntur: జీవో నెం.33ను తక్షణమే ఉపసంహరించుకోవాలి!
Guntur: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ మార్పిడిలకు సంబంధించి జారీ చేసిన జీవో నెం.33ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె. నారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులో వీడియో ద్వారా తెలియజేశారు. గతంలో కిడ్నీ మార్పిడిల పేరుతో అనేక అక్రమ దందాలు జరిగాయని, కోట్లాది రూపాయల వ్యాపారం సాగడంతో పాటు పేద, సామాన్య ప్రజలు మోసపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయని ఆయన అన్నారు.
కిడ్నీ మార్పిడిలో రక్త సంబంధీకులకు మాత్రమే అవకాశం ఉండేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నారాయణ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత జీవో నెం.33 ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు కిడ్నీ మార్పిడిల విషయంలో మరింత అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనివల్ల కార్పొరేట్ ఆసుపత్రులు కిడ్నీ మార్పిడిని పెద్ద ఎత్తున వ్యాపారంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు.
అవయవ మార్పిడి వంటి సున్నితమైన వైద్య విధానాల్లో వ్యాపార ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే పేద ప్రజలే తీవ్రంగా నష్టపోతారని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవో వల్ల సామాన్య ప్రజలకు ప్రయోజనం కలగకపోగా, కార్పొరేట్ వైద్య రంగానికి మాత్రమే మేలు జరిగే పరిస్థితి ఏర్పడుతుందని విమర్శించారు.
రేపు జరగనున్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో జీవో నెం.33కు ఆమోదం తెలిపే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీవో నెం.33ను వెంటనే ఉపసంహరించుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




