Vinukonda: వినుకొండ రేషన్ దుకాణాల్లో భారీగా బియ్యం మాయం
Vinukonda: వినుకొండలో ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణకిరణ్ ఆకస్మిక తనిఖీ. అంగన్వాడీలు, రేషన్ షాపుల్లో అక్రమాలు గుర్తింపు. బాధ్యులపై చర్యలకు ఆదేశం.
Vinukonda: వినుకొండ రేషన్ దుకాణాల్లో భారీగా బియ్యం మాయం
వినుకొండ: వినుకొండ నియోజకవర్గంలో ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శావల్యాపురం గ్రామంలో ఉదయం 11 గంటలు దాటినా అంగన్వాడీ కేంద్రాలు తెరవకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అనంతరం గ్రామంలోని రెండు రేషన్ దుకాణాలను పరిశీలించగా, రేషన్ షాప్ నంబర్-2లో స్టాక్లో భారీ లోటు ఉన్నట్లు గుర్తించారు.
45 బస్తాల బియ్యం, 193 షుగర్ ప్యాకెట్లు, 8 క్వింటాళ్ల జొన్నలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ షార్టేజ్కు సంబంధించిన స్టాక్ ఎక్కడ ఉందో గుర్తించి బాధ్యులపై 6A కేసు నమోదు చేయాలని సంబంధిత డీటీని ఆదేశించారు. శావల్యాపురం మండలంలోని రేషన్ డిపోల పరిస్థితి సంతృప్తికరంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే వినుకొండ లోని అంగన్వాడీ కేంద్రాలు, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పంపిణీ చేస్తున్న కోడిగుడ్లపై మార్కింగ్ లేకపోవడం, గుడ్ల పరిమాణం కూడా నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం గమనించినట్లు పేర్కొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని జక్కంపూడి కృష్ణకిరణ్ ఆదేశించారు.




