Guntur Chilli Prices: మిర్చి రైతులకు గుడ్న్యూస్.. గుంటూరులో ఎండుమిర్చి ధరలు భారీగా పెరుగుదల
గుంటూరు మిర్చి యార్డులో ఎండుమిర్చి ధరలు క్వింటాకు రూ.500 నుంచి రూ.3,000 వరకు పెరిగాయి. విదేశీ డిమాండ్తో రైతులకు భారీ ఊరట లభిస్తోంది.
Guntur Chilli Prices
ఆసియాలోనే అతిపెద్ద ఎండుమిర్చి మార్కెట్గా పేరుగాంచిన గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే రకాన్ని బట్టి క్వింటాకు రూ.500 నుంచి రూ.3,000 వరకు ధరలు పెరగడం విశేషం.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్, మెక్సికో వంటి దేశాల నుంచి భారత ఎండుమిర్చికి డిమాండ్ పెరగడం, నాణ్యమైన సరుకు కొరత, ఎల్నినో ప్రభావంతో రానున్న సీజన్లో సాగుపై అనిశ్చితి నెలకొనడం వంటి కారణాలు ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.
విదేశాల్లో 'తేజ' మిర్చికి భారీ డిమాండ్
ప్రస్తుతం 'తేజ' రకం మిర్చికి విదేశీ మార్కెట్లలో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఎగుమతిదారులు పోటీపడి కొనుగోళ్లు చేస్తుండటంతో ధరలు మరింత పెరుగుతున్నాయి. అలాగే 334, సూపర్-10 రకాలకూ విదేశీ మార్కెట్లలో మంచి డిమాండ్ నమోదవుతోంది.
ప్రస్తుతం మార్కెట్లో ప్రధాన ధరలు
తేజ – రూ.23,700 (జూలై 9న రూ.21,500)
బాడిగి – రూ.29,000 (గతంలో రూ.26,000)
దేవనూరు డీలక్స్ – రూ.25,500
334 రకం – రూ.29,000 వరకు
సూపర్-10 – రూ.29,000 వరకు
2043 రకం – రూ.40,000 వరకు
గత ఏడాది ఇదే సమయంలో ఎండుమిర్చి ధరలు క్వింటాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండగా, ప్రస్తుతం కిలోకు సుమారు రూ.90 నుంచి రూ.100 వరకు పెరుగుదల నమోదైంది.
ఎల్నినో ప్రభావంపై ఆందోళన
ఎల్నినో ప్రభావం, బోర్లలో నీటి కొరత, వైరస్, ఎర్రనల్లి సమస్యల కారణంగా ఈసారి గుంటూరు మార్కెట్కు మిర్చి రాక తగ్గింది. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోతే సాగు విస్తీర్ణం, దిగుబడి రెండింటిపైనా ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.




