Kotappakonda: కోటప్పకొండలో కంచెలో బందీ అయిన రావిచెట్టు!
Kotappakonda: పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో అధికారుల నిర్ణయం వివాదాస్పదమైంది.
Kotappakonda: కోటప్పకొండలో కంచెలో బందీ అయిన రావిచెట్టు!
Kotappakonda: నరసరావుపేట మండలం కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో అధికారుల విచిత్ర నిర్ణయం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ఆలయ ప్రాంగణంలోని పవిత్ర రావి చెట్టు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దైవభక్తితో రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే ఆ వేడికి చెట్టు కాలిపోతుందని, చెట్టుకు నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ కారణంతోనే చెట్టుకు రక్షణగా కంచె ఏర్పాటు చేశామని ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు.అయితే అధికారుల ఈ చర్యతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని భక్తులు వాపోతున్నారు. గతంలోలా చెట్టు వద్ద దీపాలు వెలిగించి పూజలు చేయలేకపోతున్నామని మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, రావి చెట్టు వద్ద ఉన్న నాగదేవత విగ్రహాలకు పసుపు, కుంకుమ సమర్పించడం, హారతి ఇవ్వడం కూడా కంచె కారణంగా ఇబ్బందిగా మారిందని వారు పేర్కొన్నారు. భక్తుల ఆచారాలను దృష్టిలో ఉంచుకుని తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై స్పందించిన సూపరింటెండెంట్ శ్రీనివాస్, చెట్టుకు నష్టం కలగకుండా రక్షణ చర్యగా కంచె వేసినట్లు వివరించారు. అదే సమయంలో చెట్టుకు రక్షణ కల్పిస్తూనే భక్తులు సులభంగా పూజలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




