Guntur: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన దృష్టి.. మంగళగిరిలో కీలక భేటీ!
Guntur: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళగిరిలో జనసేన సమన్వయ భేటీ జరిగింది. బలమైన స్థానాల నివేదికను పరిశీలించి మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశం చేశారు.
Guntur: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన దృష్టి.. మంగళగిరిలో కీలక భేటీ!
Guntur: క్షేత్రస్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో గుంటూరు పార్లమెంట్ పరిధిలోని డివిజన్లు, వార్డుల వారీగా జనసేన వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
ఈ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జనసేన పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశం బుధవారం మంగళగిరిలో నిర్వహించారు. మంగళగిరి–తెనాలి ఫ్లైఓవర్ సమీపంలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సభ్యులు, ఏపీఎంఎస్ఐడీసీ (ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్)చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి విజయవాడ, గుంటూరు పార్లమెంట్ స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో డివిజన్లు, వార్డుల వారీగా పార్టీకి బలమైన పట్టున్న స్థానాల సమగ్ర జాబితాను నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, నాయబ్ కమల్, బిట్రగుంట మల్లికలతో పాటు ఎన్నికల నిర్వహణ సహాయక బృందం సభ్యులు మంత్రి కందుల దుర్గేష్కి సమర్పించారు.
అనంతరం రాబోయే స్థానిక పోరులో క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తుల సమన్వయం, తదుపరి కార్యాచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.




