Guntur: పాలపర్రులో ఎమ్మెల్యే రామాంజనేయులు ఇంటింటి ప్రచారం!
Guntur: గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే ‘ఇంటింటికీ అభివృద్ధి’ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సంక్షేమ ఫలాలను వివరించారు.
Guntur: పాలపర్రులో ఎమ్మెల్యే రామాంజనేయులు ఇంటింటి ప్రచారం!
గుంటూరు: ప్రత్తిపాడు నియోజకవర్గం, పెదనందిపాడు మండలం,పాలపర్రు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – సంక్షేమ విజయాలు, ప్రజా పాలన – ఇంటింటికీ అభివృద్ధి” కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా . బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, కరపత్రాలను అందజేస్తూ ఎమ్మెల్యే వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ స్థాయి నాయుకులు పాల్గొన్నారు.




