Bapatla: ఫిర్యాదు వాట్సాప్లో.. పరిష్కారం క్షణాల్లో: ఎమ్మెల్యే ఏలూరి!
Bapatla: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వినూత్న వాట్సాప్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నారు.
Bapatla: ఫిర్యాదు వాట్సాప్లో.. పరిష్కారం క్షణాల్లో: ఎమ్మెల్యే ఏలూరి!
బాపట్ల: ప్రజల గోడు నేరుగా వినడం, వేగంగా పరిష్కారం చూపడం లక్ష్యంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కొత్త తరహా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. గ్రామాల్లో తలెత్తే స్థానిక సమస్యలను ప్రజలు నేరుగా వాట్సాప్ ద్వారా తన క్యాంపు కార్యాలయానికి తెలియజేసేలా ఏర్పాటు చేశారు. సమస్య అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసి, పరిష్కారమయ్యే వరకూ ప్రత్యేక దృష్టి సారించడం ఈ కార్యక్రమ ప్రత్యేకత.
మార్టూరులో మంచినీటి గోస తీరేలా...
మార్టూరు గ్రామంలోని పీర్ల చావిడి ప్రాంత వాసులు మంచినీటి కటకటతో ఇబ్బందిపడుతున్నామని, కొత్త బోరు వేయించాలని వాట్సాప్ ద్వారా విన్నవించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి, మార్టూరు ప్రత్యేక అధికారి శ్రీనివాసరావును వెంటనే బోరు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
•అదే గ్రామంలోని గొట్టిపాటి నగర్లో బోరు పంపు అవసరమని మరో ఫిర్యాదు అందడంతో, మంచినీటి సమస్య తీర్చేందుకు బోరు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావును ఆయన ఆదేశించారు.
•నాగండ్లలో ప్రమాదకర విద్యుత్ తీగలపై తక్షణ చర్యలు
ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామంలో బ్రహ్మంగారి గుడి బజారు, రాముల వారి దేవాలయం సమీపంలో విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయని స్థానికులు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి, విద్యుత్ శాఖ అధికారులను తక్షణమే రంగంలోకి దింపారు. విద్యుత్ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లి తీగలను పరిశీలించి, రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల నుంచి భారీ స్పందన..
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సమస్యలపై ఆయన చూపుతున్న తక్షణ చొరవకు, అధికారులను అప్రమత్తం చేస్తున్న తీరుకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.




