Guntur: గుంటూరులో ఘనంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
Guntur: గుంటూరు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాలతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని డీపీవో నాగ సాయి కుమార్ పిలుపునిచ్చారు.
Guntur: గుంటూరులో ఘనంగా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
గుంటూరు: పరిసరాల పరిశుభ్రత ధ్యేయంగా స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని జిల్లాలో శనివారం చేపట్టారు. జిల్లాలో నియోజక వర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశాలు మేరకు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రజలతో స్వర్ణ ఆంధ్రా స్వచ్ఛ ఆంధ్రా ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్ పెదకాకాని మండలంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.
జిల్లా స్ధాయి నుంచి మండల, గ్రామ స్ధాయి వరకు నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలో మంచి అవగాహన కలుగుతుందని అన్నారు. క్యారీ బ్యాగులు, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్, చెత్త వ్యర్ధాలను క్లాప్ మిత్రాలకు అప్పగించాలని కోరారు. పరిశుభ్రత చోటుచేసుకున్న ప్రాంతాల్లో అక్కడ ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పిస్తే ఆ ప్రదేశంలో చెత్త వేసేందుకు ఎవరు ముందుకు రావడం జరగదని చెప్పారు.
రోజువారీ అవసరాలు కోసం ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాటన్, గన్ని బ్యాగులు వాడాలని కోరారు. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేదించి, ఒక మంచి అలవాటుగా మార్చుకుని స్ఫూర్తిదాయంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.




