Cancer: రక్త పరీక్షతో ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తింపు.. భారతీయ కంపెనీకి పేటెంట్
Cancer: క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడం వైద్య రంగంలో అత్యంత కీలకమైన విషయం.
Cancer: రక్త పరీక్షతో ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తింపు.. భారతీయ కంపెనీకి పేటెంట్
Cancer: క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడం వైద్య రంగంలో అత్యంత కీలకమైన విషయం. ఈ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన అనుబంధ సంస్థ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ కీలక అడుగు వేసింది. సాధారణ రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే అత్యాధునిక AI ఆధారిత సాంకేతికతకు భారత పేటెంట్ లభించింది.
ఈ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన ఈ ప్లాట్ఫామ్లో సెల్-ఫ్రీ డీఎన్ఏ (cfDNA) విశ్లేషణ, జీనోమ్ సీక్వెన్సింగ్, మిథైలేషన్ విశ్లేషణ, ఫ్రాగ్మెంటోమిక్ విశ్లేషణ, అలాగే మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించారు. దీంతో కేవలం ఒక్క రక్త నమూనా ఆధారంగా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించడంతో పాటు, అది శరీరంలోని ఏ అవయవంలో ప్రారంభమైందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రారంభ దశలో క్యాన్సర్ గుర్తించడం ఎందుకు ముఖ్యం?
కంపెనీ ప్రకారం, క్యాన్సర్ వచ్చినప్పుడు శరీరంలోని జీనోమ్లోని మిథైలేషన్ నమూనాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ కొత్త AI టెక్నాలజీ ఆ మార్పులను అత్యంత కచ్చితత్వంతో గుర్తించగలదు.
దీని వల్ల క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే సామర్థ్యం పెరుగుతుంది. ముందుగానే వ్యాధిని గుర్తిస్తే చికిత్స త్వరగా ప్రారంభించే అవకాశం ఉండటంతో రోగులు కోలుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.
భారత్లో పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు ఇది పరిష్కారమా?
కంపెనీ అంచనా ప్రకారం, భారత్లో ప్రతి ఏడాది 15 లక్షలకుపైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో చాలా మందికి క్యాన్సర్ ఇప్పటికే ముదిరిన దశకు చేరిన తర్వాతే వ్యాధి బయటపడుతోంది. అలాంటి పరిస్థితుల్లో చికిత్స క్లిష్టంగా మారడంతో పాటు కోలుకునే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ను ముందుగానే గుర్తించగలిగితే, చికిత్సను త్వరగా ప్రారంభించి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది.
తక్కువ ఖర్చుతో పెద్ద ఎత్తున పరీక్షలు..
ప్రస్తుతం క్యాన్సర్ స్క్రీనింగ్ కొన్ని రకాల క్యాన్సర్లకే పరిమితమై ఉంది. కానీ జీనోమ్ సీక్వెన్సింగ్ ఖర్చు క్రమంగా తగ్గుతున్నందున, భవిష్యత్తులో ఈ AI ఆధారిత టెక్నాలజీతో పెద్ద ఎత్తున, తక్కువ ఖర్చుతో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. దీనికి ప్రత్యేకంగా కొత్త మౌలిక సదుపాయాలు కూడా అవసరం ఉండకపోవచ్చని తెలిపింది.
స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ సీఈఓ మాట్లాడుతూ, భారత్లో క్యాన్సర్ వేగంగా పెరుగుతున్న ప్రజారోగ్య సమస్యగా మారుతోందన్నారు. ఈ పేటెంట్ కంపెనీ అభివృద్ధి చేసిన AI ఆధారిత లిక్విడ్ బయాప్సీ టెక్నాలజీకి గుర్తింపని పేర్కొన్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ను ముందుగానే గుర్తించడం, మెరుగైన చికిత్స అందించే దిశగా మరిన్ని ఆధునిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అనుబంధ సంస్థ. ఇది బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుంచి ప్రారంభమైన సంస్థగా, జీనోమిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, ప్రిసిషన్ మెడిసిన్, క్యాన్సర్ నిర్ధారణ రంగాల్లో పరిశోధనలు చేస్తోంది.




