Thummala Nageswara Rao: ఎల్నినోపై సచివాలయంలో రివ్యూ.. జిల్లాలకు కీలక ఆదేశాలు!
Thummala Nageswara Rao: తెలంగాణలో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Thummala Nageswara Rao: ఎల్నినోపై సచివాలయంలో రివ్యూ.. జిల్లాలకు కీలక ఆదేశాలు!
Thummala Nageswara Rao: దేశంలో రాబోయే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఎల్నినో వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల వారీగా అధికారులు సేకరించిన క్షేత్రస్థాయి నివేదికలను మంత్రికి సమర్పించారు. అనంతరం ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా తట్టుకునేలా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు మంత్రి తుమ్మల స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
మంత్రి తుమ్మల జారీ చేసిన కీలక మార్గదర్శకాలు:
నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి సాగును వీలైనంత వరకు తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి.
రైతులు వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు చిరుధాన్యాలు (Millets), పప్పుధాన్యాలు, మరియు నూనెగింజల సాగు వైపు మళ్లేలా పటిష్ట ప్రోత్సాహం అందించాలి.
వర్షపాతం లోటును తట్టుకునేందుకు ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కంటింజెన్సీ (ఆకస్మిక) ప్రణాళికను తక్షణమే అమలు చేయాలి.
భూగర్భ జలాల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి. నీటి వృధాను అరికట్టేందుకు డ్రిప్ (బిందు) మరియు స్ప్రింక్లర్ సాగు పద్ధతులను విస్తృతంగా రైతుల్లోకి తీసుకెళ్లాలి.
వాతావరణ పరిస్థితులపై ఐఎమ్డీ (IMD) సమాచారాన్ని క్రమం తప్పకుండా విశ్లేషిస్తూ, రైతులకు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సూచనలు అందజేయాలి.
రాబోయే రోజుల్లో తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తుగా నిల్వలు మరియు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి.
వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వ్యవసాయ, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో ఎల్నినో సవాలును ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.




