ఎల్ నినో ముప్పు.. మీ పొలాన్ని వాటర్ బ్యాంక్‌గా మార్చుకోండి!

కరవు ముప్పు ముంచుకొస్తున్నప్పుడు, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే... ఇప్పుడు కాస్తో కూస్తో కురుస్తున్న వర్షపు నీటిని అపురూపంగా దాచుకోవడమే మనకున్న ఏకైక మార్గం

Srinivas Rao
Published on: 13 Jun 2026 7:57 PM IST
ఎల్ నినో ముప్పు.. మీ పొలాన్ని వాటర్ బ్యాంక్‌గా మార్చుకోండి!
X

"వస్తోంది ఎల్ నినో... మరి వర్షం పడుతున్నప్పుడే జాగ్రత్త పడితే..." ఈ మాట ఈరోజు ప్రతి రైతు గుండెల్లోనూ ఒక హెచ్చరికలా మోగుతోంది. 'ఎల్ నినో' వస్తోంది అంటేనే వాతావరణం తలకిందులు కాబోతుందని అర్థం—సకాలంలో వర్షాలు పడవు, పడినా సరిగ్గా ఉండవు, ఎండలు మండిపోతాయి. ఇలాంటి కరవు ముప్పు ముంచుకొస్తున్నప్పుడు, చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే... ఇప్పుడు కాస్తో కూస్తో కురుస్తున్న వర్షపు నీటిని అపురూపంగా దాచుకోవడమే మనకున్న ఏకైక మార్గం.

వర్షం పడుతున్నప్పుడే బుద్ధిగా ఆలోచించి, మన పొలంలో పడ్డ ప్రతి చుక్కనూ భూమిలోనే దాచుకునేలా ఇప్పుడే జాగ్రత్త పడితే... రేపు ఎల్ నినో వల్ల ఎండలు ముదిరినా, కరవు ఎదురైనా మన పంటను, మన పెట్టుబడిని ప్రాణప్రదంగా కాపాడుకోవచ్చు. మరి ఆ ముందస్తు జాగ్రత్తలు ఏంటో, ఈ వర్షపు నీటిని పొలంలోనే ఎలా ఒడిసి పట్టుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం...

వర్షపు నీటిని పొలాల వద్దే ఒడిసి పట్టుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరమైన పని. ఎందుకంటే, వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు తప్పుతాయో ఎవరికీ తెలియడం లేదు. అందుకే మన పొలంలో పడ్డ ప్రతి చుక్కను బయటకు పోనివ్వకుండా దాచుకుంటే, రేపు ఎండలు ముదిరినప్పుడు లేదా పంట చేతికి వచ్చే టైంలో వర్షాలు లేకపోయినా ఆ నీటితో పంటను కాపాడుకోవచ్చు. దీనికోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు, చిన్న చిన్న చిట్కాలతోనే మన పొలాన్ని ఒక నీటి నిధిలా మార్చుకోవచ్చు.

మొదటిగా, మన పొలాల్లో "పంట కుంటలు" తవ్వుకోవడం అన్నింటికంటే బెస్ట్ ఐడియా. పొలంలో నీరంతా ఎటువైపు పల్లంగా ప్రవహిస్తుందో చూసి, అక్కడ ఒక పెద్ద గుంత తవ్వి పెట్టుకుంటే చాలు. వర్షం పడినప్పుడు ఆ నీరంతా వచ్చి అందులో చేరుతుంది. అయితే, ఎర్ర నేలలు లేదా ఇసుక నేలల్లో నీరు త్వరగా భూమిలోకి ఇంకిపోతుంది కాబట్టి, ఆ కుంట అడుగున నల్లరేగడి మట్టి వేసి గట్టిగా తొక్కించడం లేదా ప్లాస్టిక్ షీట్లు పరచడం చేస్తే నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పంట ఎండిపోతున్నప్పుడు ఈ నీటిని ఇంజన్ పెట్టి వాడుకోవచ్చు.

ఇక రెండోది, మీ పొలంలో ఎండిపోయిన లేదంటే నీళ్లు లేక పక్కన పడేసిన బోరు బావులు ఏవైనా ఉంటే, వాటిని అస్సలు వదిలేయకండి. వాటి చుట్టూ ఒక గుంత తవ్వి, రాళ్లు, ఇసుక, బొగ్గుతో ఒక ఫిల్టర్ లాగా తయారు చేసి, వర్షపు నీటిని ఆ బోరులోకి వెళ్లేలా చేయొచ్చు. దీన్ని "బోరు బావుల రీఛార్జ్" అంటారు. ఇలా చేయడం వల్ల వర్షపు నీరు భూమి లోపల ఉండే పొరల్లోకి నేరుగా వెళ్లిపోతుంది. దీనివల్ల మీ బోరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న బావుల్లో కూడా నీటి మట్టం పెరిగి, మళ్లీ బోరులో నీళ్లు పడే అవకాశం ఉంటుంది.

కనీసం ఎలాంటి ఖర్చు పెట్టలేము అనుకుంటే, మన పాత పద్ధతి అయిన "చేను గట్లు" బలంగా వేసుకోవడం చాలా ముఖ్యం. పొలం చుట్టూ ఉన్న గట్లను కాస్త ఎత్తుగా, లావుగా వేసుకుంటే వర్షపు నీరు పొలం దాటి పక్కవాడి పొలంలోకో, వాగుల్లోకో కొట్టుకుపోదు. అలాగే, పొలాన్ని ఎగుడుదిగుడులు లేకుండా చదును చేసుకుంటే, పడ్డ నీరు పడ్డట్టుగా పొలమంతా సమానంగా ఇంకుతుంది. దీనివల్ల భూమిలో తేమ ఎక్కువ రోజులు ఉండి, పంటకు బలాన్ని ఇస్తుంది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story