Nagole: నాగోల్ నయీమ్ హత్య కేసు ఛేదన 24 గంటల్లో 8 మంది అరెస్ట్!

Nagole: నాగోల్‌లో సంచలనం సృష్టించిన ఎండీ నయీమ్‌ హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు 8 మంది నిందితుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన సీపీ సుమతి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 16 Sept 2026 2:03 PM IST
Nagole
X

Nagole: నాగోల్ నయీమ్ హత్య కేసు ఛేదన 24 గంటల్లో 8 మంది అరెస్ట్!

Nagole: ఎల్బీనగర్ నాగోల్‌లో సంచలనం సృష్టించిన ఎండీ నయీమ్‌ హత్య కేసును ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్‌ జోన్‌, నాగోల్‌ పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన 24 గంటల్లోనే ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నలుగురు పరారీలో ఉండగా వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

సెప్టెంబర్‌ 14న బండ్లగూడలోని సుప్రీమ్‌ వైన్స్‌ వద్ద నయీమ్‌పై నిందితులు ప్రాణాంతక ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. పోలీసుల దర్యాప్తు ప్రకారం నయీమ్‌ కళ్లలో కారం పొడి చల్లి వెంబడించారు. అనంతరం వేట కొడవలితో తల, కుడి చేతిపై దాడి చేశారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఇనుప పెనంతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై నయీమ్‌ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.

పాత స్నేహం, కొత్త కక్షలు హత్యకు కుట్ర

పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీమ్‌, సయ్యద్‌ రబ్బానీ, కనకం ఉమా మహేష్‌లు 2024లో సోమాజిగూడలో జరిగిన ఓ రియల్‌ ఎస్టేట్‌ కార్యక్రమంలో పరిచయమైనట్లు పోలీసులు తెలిపారు.

తర్వాత ముగ్గురూ కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి ఉప్పల్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మూడు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు వెల్లడించారు.

అయితే ఇటీవల నయీమ్‌తో విభేదాలు, బెదిరింపులు ఏర్పడటంతో కనకం ఉమా మహేష్‌, సయ్యద్‌ రబ్బానీ, ఒట్ల దినకర్‌లు నయీమ్‌ను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.

జైలు స్నేహితుడితో కలిసి మర్డర్‌ ప్లాన్‌

ఈ కుట్రలో భాగంగా సయ్యద్‌ రబ్బానీ తన మాజీ జైలు సహచరుడు రసుమల్ల సాకేత్‌ను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. సాకేత్‌ ద్వారా వొల్లిపొల్ల మహేష్‌, అతడి సహచరులు ఈ పథకంలోకి వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఖమ్మంలో మర్డర్‌ ప్లాన్‌.. హైదరాబాద్‌లో అమలు

సెప్టెంబర్‌ 13న నిందితులు ఖమ్మంలో సమావేశమయ్యారు. అక్కడ రాత్రి బస చేసి నయీమ్‌ హత్యకు సంబంధించిన పథకాన్ని చర్చించినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిదో నిందితుడు మహ్మద్‌ బద్రుల్లా హుస్సేన్‌ అలియాస్‌ బద్రి వారికి ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు.

ఆ తర్వాత సెప్టెంబర్‌ 14న నిందితులు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి.. నయీమ్‌ కదలికలపై సమాచారం సేకరించి బండ్లగూడలోని సుప్రీమ్‌ వైన్స్‌ వద్ద పథకాన్ని అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

8 మంది అరెస్ట్‌.. 4 గురి కోసం గాలింపు

ఈ కేసులో సయ్యద్‌ రబ్బానీ, ఒట్ల దినకర్‌, వొల్లిపొల్ల మహేష్‌, రసుమల్ల సాకేత్‌, అలకుంట వెంకట్‌, కొడిగంటి రాఘవేందర్‌ అలియాస్‌ రఘు, వల్లపుదాసు చరణ్‌ గౌడ్‌, మహ్మద్‌ బద్రుల్లా హుస్సేన్‌ అలియాస్‌ బద్రిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరోవైపు కనకం ఉమా మహేష్‌, మహ్మద్‌ ఇస్మాయిల్‌ జబీ, భోలే, కార్తీక్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

ఆయుధాలు.. వాహనాలు స్వాధీనం

హత్యకు ఉపయోగించినట్లు పేర్కొన్న వేట కొడవలి, ఇనుప పెనం, అలాగే హత్యకు ఉపయోగించిన టయోటా కారు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు ఎండీ నయీమ్‌ ఇల్లందు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి ఐపీఎస్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో, ఎల్‌బీనగర్‌ డీసీపీ బి.అనురాధ ఐపీఎస్‌, ఎస్‌ఓటీ డీసీపీ కే.మనోహర్‌, అదనపు డీసీపీ ఎండీ షాకీర్‌ హుస్సేన్‌, ఎల్‌బీనగర్‌ ఏసీపీ బి.రవీందర్‌ రెడ్డి, నాగోల్‌ ఇన్‌స్పెక్టర్‌ మక్బూల్‌ జానీ, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ కే.ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసును ఛేదించారు.

హత్య జరిగిన 24 గంటల్లోనే ఎనిమిది మందిని అరెస్ట్‌ చేయడం ద్వారా నాగోల్‌ నయీమ్‌ హత్య కేసులో కీలక పురోగతి సాధించారు. పరారీలో ఉన్న మరో నలుగురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR