OsmaniaUniversity: ఓయూలో ఏబీవీపీ నిరసన.. ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
OsmaniaUniversity: ఉస్మానియా వర్సిటీలో రూ.1000 కోట్ల నిధులు, 941 పోస్టుల భర్తీకై ఏబీవీపీ ర్యాలీ. పోలీసులతో విద్యార్థుల తోపులాటతో క్యాంపస్లో నిరసన.
OsmaniaUniversity: ఓయూలో ఏబీవీపీ నిరసన.. ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా విద్య పరిరక్షణకై ఉద్యమిద్దాం అంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఓయూ లో ర్యాలీ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మ దహనం అడ్డుకునే ప్రయత్నం లో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా ఎబివిపి ఓయూ అధ్యక్షులు గెల్లు శేఖర్, కార్యదర్శి గుడూర్ మోక్షిత్ లు మాట్లాడుతూ ఉస్మానియా విద్య పరిరక్షణకై ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ కు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కళాశాల వేదికగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించిన హామీని వెంటనే అమలు చేసి, ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 941 టీచింగ్ పోస్టులను మరియు నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు రావాల్సిన 103 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా కాలంగా వెనుకబడిన అకాడమిక్ క్యాలెండర్ను తక్షణమే సరిచెయ్యాలని విశ్వవిద్యాలయ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో సిటీ సెక్రటరీ పృథ్వితేజ, స్టేట్ జాయింట్ సెక్రెటరీ అలివేలు రాజు, విద్యానగర్ విభాకాన్వీనర్ హరిప్రసాద్, స్టేట్ యూనివర్సిటీ కో కన్వీనర్ గంధం నరేందర్, వంశీ, వీరబాబు, తన్మై, తదితరులు పాల్గొన్నారు.




