LB Nagar: క్రెడిట్ కార్డు అప్‌డేట్ పేరుతో న్యాయవాదికి రూ.2 లక్షల బురిడీ

LB Nagar: క్రెడిట్ కార్డు అప్‌డేట్ పేరుతో నాగోలుకు చెందిన న్యాయవాది వద్ద రూ.2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు. మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసుల కేసు నమోదు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 23 Aug 2026 9:32 AM IST
LB Nagar
X

LB Nagar: క్రెడిట్ కార్డు అప్‌డేట్ పేరుతో న్యాయవాదికి రూ.2 లక్షల బురిడీ

LB Nagar: క్రెడిట్‌ కార్డు అప్‌డేట్‌, లిమిట్‌ పెంపు పేరుతో సైబర్‌ నేరగాడు ఓ న్యాయవాదిని బురిడీ కొట్టించాడు. బ్యాంకు ప్రతినిధినంటూ ఫోన్‌ చేసి నమ్మించి ఓ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయించి బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.2 లక్షలు కాజేశాడు. మరో రూ.75 వేల నగదును కూడా దోచుకునేందుకు ప్రయత్నించగా ఓటీపీ వెరిఫికేషన్‌ మెసేజ్‌ రావడంతో బాధితుడు అప్రమత్తమయ్యాడు.

మల్కాజిగిరి సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం. నాగోలులో నివసించే విష్ణుకాంత్‌రెడ్డి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గత నెల 29న ఆయనకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నాడు.

క్రెడిట్‌ కార్డును అప్‌డేట్‌ చేయాల్సి ఉందని, అదే సమయంలో కార్డు లిమిట్‌ను కూడా పెంచుతామని బాధితుడిని నమ్మించాడు. ఇందుకోసం ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించాడు. నిందితుడి మాటలను నమ్మిన విష్ణుకాంత్‌రెడ్డి అతడు చెప్పిన విధంగా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు.

అనంతరం క్రెడిట్‌ కార్డు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన పలు వివరాలను నిందితుడు అడిగాడు. బ్యాంకు ప్రతినిధేనని భావించిన బాధితుడు అతడు అడిగిన సమాచారాన్ని అందించాడు.

ఇదే అదునుగా చేసుకున్న సైబర్‌ నేరగాడు బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.2 లక్షలను తన ఖాతాకు మళ్లించాడు. ఖాతా నుంచి భారీ మొత్తం డెబిట్‌ కావడంతో బాధితుడు షాక్‌కు గురయ్యాడు.

అయితే నిందితుడు అక్కడితో ఆగలేదు. మరో రూ.75 వేల నగదును కాజేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో బాధితుడి ఫోన్‌కు ఓటీపీ వెరిఫికేషన్‌ మెసేజ్‌ రావడంతో అనుమానం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన విష్ణుకాంత్‌రెడ్డి తదుపరి లావాదేవీని అడ్డుకున్నారు.

తాను సైబర్‌ మోసానికి గురైనట్లు గుర్తించిన బాధితుడు వెంటనే మల్కాజిగిరి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాంకు ప్రతినిధుల పేరుతో మోసాలు అప్రమత్తంగా ఉండాలి.

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామని, కార్డు అప్‌డేట్‌ చేస్తామని, రివార్డ్‌ పాయింట్లు వస్తాయని చెప్పే గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌ను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్‌ కార్డు వివరాలు, ఓటీపీలు, పిన్‌లు ఇతరులకు చెప్పకూడదని హెచ్చరిస్తున్నారు.

గుర్తుతెలియని వ్యక్తులు సూచించిన యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేయకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించడంతోపాటు సైబర్‌ నేరంపై ఫిర్యాదు చేయాలని సూచించారు.

బ్యాంకు పేరుతో వచ్చే ప్రతి ఫోన్‌ నిజమైనది కాదు అప్రమత్తతే సైబర్‌ మోసాలకు అడ్డుకట్ట!

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story