Bachupally: బాచుపల్లి పెద్ద చెరువు కాలుష్యంపై ఆకుల సతీష్ టీం ధర్నా
Bachupally: నిజాంపేట్ సర్కిల్ బాచుపల్లి పెద్ద చెరువులోకి (భైరవ చెరువు) డ్రైనేజీ మురికినీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆకుల సతీష్
Bachupally: బాచుపల్లి పెద్ద చెరువు కాలుష్యంపై ఆకుల సతీష్ టీం ధర్నా
బాచుపల్లి: నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లి ప్రాంతంలో సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు (భైరవ చెరువు) గత కొన్ని నెలలుగా తీవ్ర కాలుష్యానికి గురవుతోంది. గత సంవత్సరం అక్టోబర్ నెల నుండి పైప్రాంతాల నుండి వచ్చే డ్రైనేజ్ లైన్లకు సంబంధించిన 8 మ్యానువల్స్ పగిలిపోవడంతో ప్రతిరోజూ మురికి నీరు చెరువులోకి చేరుతోంది. దీంతో మంచినీటి చెరువు క్రమంగా మురికినీటి చెరువుగా మారిపోతోందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెరువులోకి మురికి నీరు చేరడం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపించడంతో పాటు చెరువు నీటి రంగు పూర్తిగా మారిపోయింది. అదేవిధంగా ఎస్ఎన్డీపీ నాలాలో కూడా మురికి నీరు కలుస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. భవిష్యత్తులో ఈ చెరువును పునరుద్ధరించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు పేర్కొన్నారు.
ఈ సమస్యపై ఇప్పటికే డిప్యూటీ కమిషనర్ మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని కాలనీ ప్రజలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ ఆధ్వర్యంలో స్థానిక కాలనీ ప్రజలతో కలిసి మురికి నీరు చెరువులో కలుస్తున్న ప్రాంతంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
వారి ప్రధాన డిమాండ్లు: • మురికి నీరు చెరువులోకి చేరకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.
* పగిలిపోయిన మ్యానువల్స్ను వెంటనే మరమ్మతు చేయాలి
* మూడు ఫీట్ల పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
* చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించి చెరువును అభివృద్ధి చేయాలి
. పెద్ద చెరువులకు వచ్చే ఎస్ ఎన్ డి పి నాలాలో మురికి నీరు కలపకూడదు.
* భవిష్యత్తులో చెరువును మంచినీటి వనరుగా పరిరక్షించాలి
నెల రోజులలో పనులు ప్రారంభించకపోతే నిజాంపేట్ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆకుల సతీష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, సుహాసిని శక్తి, గొల్ల కృష్ణ, హరీష్, మురళి, రమేష్, చందు ,హనుమయ్య, పాండు, అంకం సతీష్ వివిధ కాలనీల ప్రజలు పాల్గొన్నారు.




