Boduppal: బొల్లిగూడంలో తీవ్ర ఉద్రిక్తత.. కల్వకుంట్ల కవిత అరెస్ట్!
Boduppal: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ బొల్లిగూడంలో తెలంగాణ రక్షణ సేన భూపోరాట సభ ఉద్రిక్తంగా మారింది.
Boduppal: బొల్లిగూడంలో తీవ్ర ఉద్రిక్తత.. కల్వకుంట్ల కవిత అరెస్ట్!
బోడుప్పల్: ఉప్పల్ బాగాయత్లో నిర్వహించాలనుకున్న భూపోరాట సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు ముందస్తు అరెస్టులు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన నాయకత్వం సభా వేదికను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బొల్లిగూడం ప్రాంతానికి మార్చింది. అయితే అక్కడ కూడా పోలీసులు సభ నిర్వహణను అడ్డుకోవడంతో బొల్లిగూడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భూపోరాట సభ కోసం తెలంగాణ రక్షణ సేన నాయకులు ఏర్పాటు చేసిన టెంట్లను అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు తొలగించారు.
ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఉద్యమకారులు నిరసనకు దిగడంతో కొద్దిసేపు పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
భూపోరాటంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
కవిత అరెస్టును నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగగా, బోడుప్పల్ బొల్లిగూడం ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరోవైపు, బోడుప్పల్ బొల్లిగూడం ప్రాంతంలోని దళితుల భూములను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వాధీనం చేసుకుని ఎకరానికి 600 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందని స్థానిక దళితులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూపోరాటాన్ని వ్యతిరేకిస్తూ వారు కూడా నిరసన వ్యక్తం చేశారు.
భూపోరాటం సందర్భంగా అదుపులోకి తీసుకున్న తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలను ఘట్కేసర్తో పాటు పలు పోలీస్ స్టేషన్లకు తరలించినట్లు తెలుస్తుంది. దీనికి నిరసనగా తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టి, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం బొల్లిగూడం ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.




