Hyderabad: పసికందు కిడ్నాప్ కేసును చేదించిన చందానగర్ పోలీసులు

Hyderabad: హైదరాబాద్ చందానగర్ పరిధిలోని లింగంపల్లిలో నెల రోజుల పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 3 July 2026 2:09 PM IST
Hyderabad
X

Hyderabad: పసికందు కిడ్నాప్ కేసును చేదించిన చందానగర్ పోలీసులు

Hyderabad: పోలీసుల తదుపరి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా (తోప్సియా) ప్రాంతానికి చెందిన రెహ్నుమా అలీ (30) అనే మహిళకు 2021లో మహమ్మద్ సనవార్‌తో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేకపోవడంతో, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివసిస్తున్న తన పిన్ని నిమ్మీ జహానీ సీమా (భర్త హషీమ్ అలీ)ని సంప్రదించి, డబ్బులు ఇస్తానని, దత్తత కోసం ఏదైనా చిన్న బిడ్డను ఏర్పాటు చేయాలని కోరింది.

​దీంతో సీమా నేరెడ్‌మెట్‌కు చెందిన తన స్నేహితురాలు నాజియాకు ఈ విషయం చెప్పింది. నాజియా వెంటనే వికారాబాద్‌కు చెందిన తన కాబోయే భర్త, నిందితుడైన జుబేర్‌కు సమాచారం అందిస్తూ.. ఒక పసిబిడ్డను తీసుకొస్తే భారీగా డబ్బులు ఇస్తారని ఆశ చూపింది.

​కిడ్నాప్‌కు పక్కా ప్రణాళిక

​నిందితుడు జుబేర్ వెంటనే తన అనుచరుడు, వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో పాత దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న ఆటో డ్రైవర్ ఇర్ఫాన్‌ను సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి పసిబిడ్డను కిడ్నాప్ చేసి, అమ్మి సొమ్ము చేసుకోవాలని నేరపూరిత కుట్ర పన్నారు. అనువైన లక్ష్యం కోసం వెతుకుతుండగా, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక తల్లి తన నెల రోజుల ఆడబిడ్డతో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రపోతుండటం వీరి కంటపడింది.

​ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, 30.06.2026 తెల్లవారుజామున నిందితులు తమ స్నేహితుడైన ఆరిఫ్‌కు చెందిన ఆటో-రిక్షాను అద్దెకు తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. తెల్లవారుజామున సుమారు 02:00 గంటల సమయంలో నిద్రిస్తున్న ఆ తల్లి ఒడిలో నుండి ఆ నెల రోజుల ఆడబిడ్డను బలవంతంగా కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బిడ్డను నాజియా ఇంటికి తీసుకెళ్లి, కిడ్నాప్ విజయవంతమైందని సీమా మరియు రెహ్నుమా అలీలకు సమాచారం అందించారు.

​ఆన్‌లైన్ పేమెంట్ మరియు పోలీసుల ఎంట్రీ

​01.07.2026 నాడు, రెహ్నుమా అలీ ఆ కిడ్నాప్ చేసిన బిడ్డను తన ఆధీనంలోకి తీసుకోవడం కోసం కోల్‌కతా నుండి తన పిన్ని సర్వారితో కలిసి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకుంది. ఒప్పందంలో భాగంగా, నిందితుడు జుబేర్ ఆ పసిబిడ్డ అక్రమ విక్రయానికి సంబంధించి రెహ్నుమా అలీ నుండి ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా రూ. 1,50,000/- అందుకున్నాడు.

​అయితే, నిందితులు ఆ కిడ్నాప్ చేసిన బిడ్డతో కలకత్తాకు పారిపోయేలోపే అలర్ట్ అయిన పోలీసు బృందం నిందితులందరినీ విజయవంతంగా పట్టుకుంది. నెల రోజుల ఆడబిడ్డను సురక్షితంగా రక్షించి, తిరిగి ఆమె కన్నతల్లికి అప్పగించారు. పోలీసుల సత్వర విచారణ, సమన్వయ బృందకృషి మరియు విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్ కారణంగా ఈ అంతర్రాష్ట్ర మానవ రవాణా మరియు కిడ్నాప్ ముఠా ఆటకట్టయింది. విచారణ బృందాల సమన్వయ ప్రయత్నాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story