Nagole: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: నాగోల్ సీఐ!
Nagole: నాగోల్ శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో 'సైబర్ జాగ్రూకత దివస్' సందర్భంగా అవగాహన సదస్సు.
Nagole: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: నాగోల్ సీఐ!
నాగోల్: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ సూచించారు. సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ... ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి గోప్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ షాపింగ్, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో, అలాగే డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫోన్ చేయడంతో పాటు cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం పెంచేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. ఉదయ్ కిరణ్, అధ్యాపకులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు సైబర్ నేరాల నివారణకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందారు.




